Omicron: భారత్ లో బయటపడ్డ ఒమిక్రాన్, కర్ణాటకలో ఇద్దరికి...

By Siva KodatiFirst Published Dec 2, 2021, 5:01 PM IST
Highlights

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి దేశంలో రెండు కేసుల్ని గుర్తించినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ గతవారం దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇది 20కి పైగా దేశాలకు వ్యాపించింది.   
 

కర్ణాటకలో ఇద్దరు పురుషుల్లో ఈ వేరియంట్‌ బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వారిలో ఒకరి వయసు 66 ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకకు వచ్చిన వీరిద్దరికీ తొలుత కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణ కోసం పంపినట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారిద్దరిలో ఒమిక్రాన్‌ ఉన్నట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జోనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) నిర్ధారించినట్లు ఆయన చెప్పారు. 

ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 29 దేశాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నాటి నుంచి నేటివరకు 373 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు పేర్కొంది.  దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా.. బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్‌ 16, హాంగ్‌కాంగ్‌ 7, ఇజ్రాయిల్‌ 2, బెల్జియం 2, యూకే 32, జర్మనీ 10, ఆస్ట్రేలియా 8, ఇటలీ 4, డెన్మార్క్‌ 6, ఆస్ట్రియా 4, కెనడా 7, స్వీడెన్‌ 4, స్విట్జర్లాండ్‌ 3, స్పెయిన్‌ 2, పోర్చుగల్‌ 13, జపాన్‌ 2, ఫ్రాన్స్‌ 1, ఘనా 33, దక్షిణ కొరియా 3, నైజీరియా 3, బ్రెజిల్‌ 2, నార్వే 2, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్‌ యూఏఈలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా భారత్‌లో రెండు కేసులు వెలుగులోకి రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. 

Also Read:Omicron: తమిళనాడులో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్.. వేరియంట్ టెస్టు కోసం శాంపిళ్లు

అయితే కొత్త వేరియంట్ వెలుగుచూసిన ఇద్దరిలోనూ అంత తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవగాహన, అప్రమత్తంగా వుండాలని దేశప్రజలకు ఆయన సూచించారు. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం ఖచ్చితంగా పాటించాలని లవ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకోవాలని ఆయన కోరారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం దేశవ్యాప్తంగా 37 ప్రయోగశాలలు ఏర్పాటు చేసినట్టు .. ఒమిక్రాన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్‌ తప్పనిసరి చేసినట్టు లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా సరే వారం రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉంచుతామన్నారు. 

click me!