
రాజస్థాన్లోని అతిపెద్ద ప్రభుత్వాసుపత్రి అయిన సవాయి మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రిలో ఆపరేషన్ తర్వాత 18 మందికి కంటి చూపు పోయింది. బాధితులు గత నెలలో ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో చేరి కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘‘ చిరంజీవి ఆరోగ్య పథకం’’ కింద నిర్వహించబడ్డాయి. ఆపరేషన్ తర్వాత రోగులు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతూ.. తిరిగి ఆసుపత్రిలో చేరారు. వెంటనే స్పందించిన వైద్యులు మరోసారి శస్త్ర చికిత్సలు చేయించినప్పటికీ వారు చూపును పొందలేకపోయారు.
దీనిపై చందా దేవి అనే రోగి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఒక కంటి నుంచి అస్సలు చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు నొప్పి, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలతో బాధపడ్డానని ఆమె తెలిపారు. దీనిపై డాక్టర్ను సంప్రదించగా .. ఇది ఇన్ఫెక్షన్ అని నెమ్మదిగా కోలుకుంటావని చెప్పారని చందాదేవి వెల్లడించారు. అయితే డాక్టర్లు, వైద్య సిబ్బంది సమస్య తీవ్రత తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతున్నప్పటికీ.. రోగులను ఇంటికి తీసుకెళ్లమని చెప్పారని వారు ఆరోపిస్తున్నారు.
తమకు జూన్ 23న ఆపరేషన్ జరిగిందని.. కానీ ఇప్పుడు తాను ఏమీ చూడలేకపోతున్నానని రామ్ భజన్ అనే రోగి కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు ఈ ఆరోపణలను ఆసుపత్రి అధికారులు ఖండించారు. వైద్యుల వైపు నుంచి ఎలాంటి లోపం లేదని.. ప్రస్తుతం మైక్రో బయాలజీ పరిశోధన జరుగుతోందన్నారు. నివేదిక వచ్చిన అనంతరం అసలు విషయం తేలుతుందని ఎస్ఎంఎస్ ఆప్తాల్మాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ పంకజ్ శర్మ తెలిపారు.