దారుణం : 15యేళ్ల బాలికను బెదిరించి... ఆరు నెలలుగా ఐదుగురి అత్యాచారం !

By AN TeluguFirst Published Apr 13, 2021, 6:27 PM IST
Highlights

తమిళనాడులోని కడలూరులో హేయమైన సంఘటన జరిగింది. ఆరు నెలలుగా ఓ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

తమిళనాడులోని కడలూరులో హేయమైన సంఘటన జరిగింది. ఆరు నెలలుగా ఓ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

అమ్మాయి కనబడితే చాలు అత్యాచారం చేయాలన్నా మానసికస్థితి సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఆడపిల్లై పుట్టడంతో రక్షణ కరువై... క్షణక్షణం భయంతో బతకాల్సిన పరిస్థితి దాపురించింది. 

తమిళనాడులోని కడలూరులో ఓ 15 యేళ్ల బాలికను ఐదుగురు యువకులు బెదిరించి, గత ఆరు నెలలుగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

నిందితులు అందరూ 19 నుంచి 21యేళ్ల లోపు వారే కావడం మరో దారుణమైన పరిస్థితికి నిదర్శనం. బాధితురాలు తమ బాబాయి ఇంట్లో ఉన్నప్పుడు నిందితులు ఈ దారుణానికి తెగబడ్డారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని ఎన్. ధీన (21), ఎస్. విగ్నేష్(19), వి.హోనెస్ట్ రాజ్ (21)గా గుర్తించారు.

ఇటీవల బాలిక ఆరోగ్యం క్షీణించడంతో యువకులు చేస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక దిగులుగా ఉండడం, అనారోగ్యం బారిన పడడంతో ఏం జరిగిందని ఆమె బాబాయి ప్రశ్నించాడు. దీనికి బాలిక చెప్పింది విని హతాశుడయ్యాడు. 

వెంటనే ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి చెన్నైలో పనిచేస్తుండగా, బాధితురాలు కడలూరులోని తన బాబాయి ఇంటి వద్ద ఉంటోంది.

నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు అరెస్ట్ కాగా ఇద్దరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న రంజిత్, రంగా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

click me!