ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ విరమణ కోసం అమెరికా తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల ఉక్రెయిన్ తో కాల్పుల విమరణకు ఒప్పించిన ట్రంప్ ఇప్పుడు రష్యా నుంచి అదే ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రష్యాకు మాస్ వార్నింగ్ ఇచ్చారు..
ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రష్యాపై పడింది. జెలెన్స్కీ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు స్వయంగా వెల్లడించారు.
ఈ విషయమై ట్రంప్ మాట్లాడుతూ.. తమ ప్రతినిధులు రష్యాకు బయల్దేరారని తెలిపారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నామని, లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ రష్యా శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా తీసుకునే తప్పుడు నిర్ణయం ఆ దేశానికే వినాశకరంగా మారుతుందన్నారు. అయితే అలాంటి ఫలితాన్ని తాను కోరుకోవడం లేదని, శాంతిని సాధించడమే తన అంతిమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో భాగంగా అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన వాగ్వాదం గురించి తెలిసిందే. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఒప్పుకోవడంతో సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి ఉక్రెయిన్పై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. పశ్చిమ రష్యాలోని కర్క్స్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే కర్క్స్లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్కు అధ్యక్షుడు వెళ్లారు.
ఈ క్రమంలోనే యుద్ధ భూమిలోని పరిస్థితులను రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జెరసిమోవ్.. పుతిన్కు వివరించారు. కొంతమంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.