పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా సాయం చేస్తుందన్నారు.
Donald Trump : భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరుదేశాల సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించడానికి సాధ్యమైన సహాయం అందిస్తానని ఆయన ప్రకటించారు. భారత్, పాకిస్తాన్ రెండూ కలిసి ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని ట్రంప్ అన్నారు.
“ఇది చాలా భయంకరంగా ఉంది. నా వైఖరి ఏంటంటే నేను ఇద్దరితోనూ కలిసి ఉంటాను. నేను ఇద్దరినీ బాగానే తెలుసు, వాళ్ళు సమస్యను పరిష్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు దాడులు ఆపాలని నేను కోరుకుంటున్నాను. రెండు దేశాలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇరుదేశాలు దాడులు ఆపాలని నేను కోరుకుంటున్నాను” అని ట్రంప్ ప్రకటన చేసారు.
భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితిని తాను నిశితంగా పరిశీలిస్తున్నానని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. శాంతియుత పరిష్కారం కోసం భారత, పాకిస్తాన్ నాయకత్వాలతో తాను సంప్రదింపులు కొనసాగిస్తానని ఆయన తెలిపారు.