Taliban: ‘పెళ్లి విందులో మ్యూజిక్ ఆపడానికి 13 మందిని కాల్చి చంపారు’

Published : Oct 30, 2021, 09:12 PM ISTUpdated : Oct 30, 2021, 09:13 PM IST
Taliban: ‘పెళ్లి విందులో మ్యూజిక్ ఆపడానికి 13 మందిని కాల్చి చంపారు’

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ పెళ్లి విందులో మ్యూజిక్‌ను ఆపేయడానికి ఏకంగా 13 మంది హతమార్చారు. ఇస్లాంలో మ్యూజిక్ నిషేధితమని తాలిబాన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఓ మీడియా సంస్థకు వివరించిన సంగతి తెలిసిందే.  

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణాలు జరుగుతూనే ఉన్నది. ఆ దేశం ఇంకా నెత్తురోడుతూనే ఉన్నది. తాజాగా, ఓ పెళ్లి విందులో మ్యూజిక్‌ను ఆపడానికి తాలిబాన్లు 13 మందిని కాల్చి చంపారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అమృల్లా సలేహ్ వెల్లడించారు. ఈ ఘటన నంగర్‌హర్‌లో చోటుచేసుకున్నట్టు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణాలకు ప్రధానంగా పాకిస్తానే కారణమని పేర్కొన్నారు.

‘నంగర్‌‌హర్‌లో ఓ పెళ్లి వేడుకలో మ్యూజిక్‌ను బంద్ చేయించడానికి తాలిబాన్లు 13 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై మన కోపాన్ని కేవలం ఖండించి సరిపుచ్చుకోలేం. ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతిని వినాశనం చేయడానికి పాకిస్తాన్ 25ఏళ్లుగా వీరికి శిక్షణ ఇచ్చారు. మా భూమిని కంట్రోల్ చేయడానికి ఐఎస్ఐ చేసిన కుట్ర ఇది. అది ఇప్పుడు అమలు జరుగుతున్నది’ అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు, మరో ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. తాలిబాన్ల పాలన మరెంతో కాలం కొనసాగబోదని నమ్మకంగా అన్నారు. అయితే, ఆ పాలన ముగిసే వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల అఘాయిత్యాలకు మూల్యం చెల్లిస్తూనే ఉండాల్సి ఉంటుందని వాపోయారు.

Also Read: ఆఫ్ఘనిస్తాన్: అప్పటిదాకా నో పనిష్మెంట్.. బహిరంగ శిక్షలపై తాలిబన్ల సంచలన ప్రకటన

తాలిబాన్లు ఆగస్టు 15న ఆఫ్ఘనిస్తాన్‌ను అధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వారివైన నిబంధనలు పాటించాలని ఆదేశిస్తూ వస్తున్నారు. అందులో మహిళలను తీవ్ర అణిచివేసే నిబంధనలున్నాయి. అందులోనే సంగీతాన్ని నిషేధించే ఉత్తర్వులున్నాయి. మహిళల గొంతూ టీవీ, రేడియో చానెల్స్‌లో వినిపించవద్దనీ హుకుం జారీ చేశారు.

ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్‌ను తాలిబాన్లు సెప్టెంబర్ 4న మూసేశారు. అంతేకాదు, ఆగస్టు చివరివారంలో అందారబీ లోయలో ఆఫ్ఘనిస్తాన్ ఫోక్ సింగర్ ఫవాద్ అందరాబీని హతమార్చారు. ఇస్లాంలో మ్యూజిక్ నిషేధితమని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. అయితే, ఈ నిబంధనను తాము ప్రజలపై ఒత్తిడి తెచ్చిఅమలు చేయకుండా వారిని ఒప్పించి అమలు జరుపుతామని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

బహిరంగంగా శిక్షలు వేస్తూ తాలిబన్లు అకృత్యాలకు పాల్పడుతున్నారు. అయితే, తాజాగా బహిరంగ శిక్షలపై (public executions) తాలిబన్లు ప్రకటన చేశారు. దేశ సుప్రీంకోర్టు (supreme court) ఆదేశాలు వచ్చే వరకు బహిరంగ శిక్షలను అమలు చేయబోమని స్పష్టం చేశారు.

Also Read: కాందహార్ మసీదుపై దాడి: ఆఫ్ఘనిస్తాన్‌లో సామూహిక అంత్యక్రియలు.. చిత్రాలివే

సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణ శిక్షలు, బహిరంగ ఉరితీతలను అమలు చేయాలని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ (zabihullah mujahid) చెప్పారు. అందుకు మంత్రిమండలి (afghanistan cabinet) ఆమోదం తెలిపిందని వెల్లడించారు. శిక్ష విధిస్తే తప్పనిసరిగా అతడు చేసిన నేరమేంటో ప్రజలకు తెలిసేలా చేయాలని చెప్పారు. అయితే, కాళ్లూచేతుల నరికివేత, ఉరితీత వంటి కఠినమైన శిక్షలను బహిరంగంగా అమలు చేస్తామని గతంలో ఆఫ్ఘనిస్థాన్ న్యాయ శాఖ మంత్రి ముల్లా నూరుద్దీన్ తురాబీ (mullah nooruddin turabi) వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా (america) దానిపై ఆందోళన వ్యక్తం చేసినా.. తాము ఎలాంటి శిక్షలు వేయాలో వేరే దేశాలు చెప్పాల్సిన పని లేదంటూ నూరుద్దీన్ మండిపడ్డారు.

కాగా, సెప్టెంబర్ 25న హెరాత్ సిటీలో వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురికి తాలిబన్లు మరణశిక్ష విధించారు. వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురిని కాల్చి చంపారు. అనంతరం మృతదేహాలను సిటీ జంక్షన్‌లో క్రేన్లతో వేలాడదీశారు. కాళ్లు, చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో వుంటాయని తాలిబన్లు వెల్లడించారు

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?