
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న రష్యాకు ఇంటా బయట నిరసన సెగ తగులుతున్నది. అమెరికా, పశ్చిమ దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్పై యుద్ధాన్ని నిరసిస్తూ రష్యాలోనే అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. రష్యాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌరులు చేస్తున్న నిరసనలు బయటి ప్రపంచానికి తెలియవస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలు బయటకు ఎక్కువగా పొక్కుతున్నాయి. ఎందుకంటే.. రష్యాలో అధికారిక మీడియా సంస్థలే ఎక్కువ. వాటికే ఆదరణ కూడా ఎక్కువగా ఉన్నది. ఇలాంటి ఓ అధికారిక మీడియా చానెల్లో ఓ ఉద్యోగి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఓ పోస్టర్ చేతపట్టుకుని లైవ్ టెలికాస్ట్లోకి వచ్చింది. వెంటనే ఆమెను అక్కడున్న తోటి ఉద్యోగులు పక్కనకు తీసుకెళ్లి ఫుటేజీ మార్చారు. ఆ వెంటనే ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నదో తెలియట్లేదని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
రష్యాలో ప్రభుత్వ నియంత్రణలోని చానెల్ వన్ను ఆ దేశంలోని వయోధికులు ఎక్కువగా చూస్తుంటారు. ఆ చానెల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే న్యూస్ షో ‘టైమ్’ను లక్షలాది మంది వీక్షిస్తుంటారు. ఆ రోజు యాంకర్గా యెకతెరినా ఆంద్రెయెవా ఉన్నారు. ఆమె బెలారస్తో రష్యాకు ఉన్న సంబంధాల గురించి ప్రోగ్రామ్లో చర్చిస్తున్నారు. నల్లటి ఫార్మల్ సూట్ ధరించిన ఒవ్స్యన్నికోవా ఓ పోస్టర్ పట్టుకుని కెమెరా వ్యూలోకి వచ్చారు. ఆ పోస్టర్ కార్డుపై నో వార్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది. ‘అదే పోస్టర్లో రష్యా భాషలో ఇలా రాసి ఉంది. యుద్ధాన్ని ఆపండి. దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఇక్కడ అంతా మీకు అబద్ధాలు చెబుతున్నారు’ ఈ యుద్ధానికి రష్యన్లు వ్యతిరేకం అని ఇంగ్లీష్లో సైన్ చేసి ఉన్నది.
ఆ పోస్టర్ పట్టుకున్న మహిళ కొన్ని మాటలు అన్నది. స్టాప్ ద వార్ అనే ముక్క వినిపించింది. అంతలోనే ఆంద్రెయెవా గట్టిగా వార్తలు చెప్పడంతో ఆమె మాటలు ఎక్కువగా వినిపించలేదు. వెంటనే ఆ చానెల్ ఓ హాస్పిటల్లోని ఫుటేజీని ప్రసారం చేసింది. అలాగే, ఆ పోస్టర్ పట్టుకున్న ఒవ్స్యన్నికోవాను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. ఒవ్స్యన్నికోవాను సమర్థిస్తున్న ఓ మానవ హక్కుల న్యాయవాది ఆమెను 12 గంటల పాటు కస్టడీలో ఉంచుకున్నట్టు తెలిపారు. ఒవ్స్యన్నికోవా న్యాయవాది మాటలను ఉటంకిస్తూ.. ఉక్రెయిన్ దౌత్యవేత్త ఒలెక్సాండర్ షెర్బా ఇలా అన్నారు. ఆమె ఇప్పుడు ఏ పోలీసు స్టేషన్లోనూ కనిపించడం లేదని వివరించారు. ఆమె ఎక్కడున్నదో తెలియట్లేదని, బహుశా ఆమెను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ఉండవచ్చని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ఒవ్స్యన్నికోవా చానెల్ వన్లో ఎడిటర్గా పని చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని పేర్కొంటున్నాయి. ఇవేవి లెక్కచేయని రష్యా ..మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దేశంలో మార్చి 24 నుండి మరో 30 రోజుల పాటు మార్షల్ లా పొడిగించాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం ఆలస్యంగా పార్లమెంటుకు బిల్లును సమర్పించారు. రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.