
ఉక్రెయిన్పై రష్యా యుద్దం నేపథ్యంలో వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్లోనే చిక్కుకుపోయారు. యుద్దం కారణంగా ఉక్రెయిన్ గగనతలం పూర్తిగా మూసివేయబడింది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ముందుగా భారతీయులను రోడ్డు మార్గంలో సరిహద్దుల్లో దేశాలకు తరలిస్తుంది. ఇప్పటికే రొమేనియా, హంగేరి దేశాలకు భారతీయులను తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్కు తీసుకువస్తుంది.
ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ఇతర దేశాలతో కూడా భారత విదేశాంగ శాఖ చర్చలు జరుపుతుంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను సరిహద్దు దేశాల్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తే వారిని ఇండియాకు తరలించడం సులువు అవుతంది. అయితే భారతీయుల తరలింపు ప్రక్రియకు సంబంధించి పోలాండ్ నుంచి శుభవార్త అందించింది. ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులందరినీ ఎలాంటి వీసా లేకుండానే పోలాండ్లోకి అనుమతించనున్నట్టుగా భారత్లోని ఆ దేశ రాయబారి Adam Burakowski తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.
ఇక, పోలాండ్లో ఇండియన్ ఎంబసీ ఇటీవల విడుదల చేసిన అడ్వైజరీలో.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయలును తరలింపు ప్రక్రియకు సూచనలు చేసింది. పశ్చిమ ఉక్రెయిన్లోని భారతీయ పౌరులను పోలాండ్ ద్వారా భారతదేశానికి తరలించాలని చూస్తున్నట్టుగా తెలిపింది. తరలింపు కోసం ఏర్పాటు చేయబడిన రాయబార కార్యాలయాల కో-ఆర్డినేట్లను గమనించాలని కోరింది. అందుకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా జత చేసింది.గూగుల్ ఫామ్లో వివరాలు రిజిస్టర్ చేయాలని పేర్కొంది.
ఇక, పోలాండ్ ప్రభుత్వం Shehyni-Medyka సరిహద్దు పాయింట్ ద్వారా కాలినడకన మాత్రమే జనాలు సరిహద్దు దాటడానికి అనుమతిస్తోంది. Krakowiec crossing వద్ద వారి వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులకు మాత్రమే అనుమతిస్తోంది. ఇక, ఇప్పటికే కొందరు భారతీయులు పోలాండ్ సరిహద్దులకు చేరుకన్న సంగతి తెలిసిందే.