
India Pakistan War : పాకిస్తాన్ సైన్యం వద్ద ఆయుధ సామగ్రి కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ దేశ యుద్ధ సామర్థ్యం కేవలం నాలుగు రోజులకే పరిమితట. ఉక్రెయిన్తో ఇటీవల జరిపిన ఆయుధ ఒప్పందాల వల్ల పాక్ వద్ద యుద్ధ నిల్వలు ఖాళీ అయినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్దం జరిగే అవకాశాలున్నాయన్న ప్రచారం వేళ ఈ వార్త ఆసక్తికరంగా మారింది.
పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (POF) సైన్యానికి సామాగ్రి సరఫరా చేస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా యుద్ద సామాగ్రికి ఇటీవల డిమాండ్ బాగా పెరగడంతో తమ వద్దఉన్న ఆయుధాలను క్యాష్ చేసుకునేందుకు పాక్ సిద్దమయ్యింది. తమ వద్ద గల ఆయుధాలను ఇతర దేశాలకు అమ్ముకుంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధ నిల్వలు కేవలం 96 గంటలపాటు అంటే నాలుగు రోజుల యుద్దానికి మాత్రమే సరిపోయేంత తక్కువగా ఉన్నట్లు సమాచారం.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల కోసం పోటీ నెలకొంది. దీంతో ఆహార కొరత, అప్పులతో కూడిన ఖజానాతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఒక అవకాశాన్ని చూసింది. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (POF) ఉక్రెయిన్కు కీలకమైన ఆయుధాల సరఫరాదారుగా మారింది, రహస్య మార్గాల ద్వారా లక్షలాది రౌండ్ల ఫిరంగుల షెల్స్, రాకెట్లు, చిన్న ఆయుధాల మందుగుండు సామగ్రిని సరఫరా చేసింది.
2023 ఫిబ్రవరి, మార్చి మధ్య అంటే రెండు నెలల వ్యవధిలనే పాకిస్తాన్ 42,000 122mm BM-21 రాకెట్లు, 60,000 155mm హోవిట్జర్ షెల్స్, 130,000 122mm రాకెట్లను రవాణా చేసి $364 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. ఇందులో 80% లాభాలు పాకిస్తాన్ ఆర్మీకి వెళ్ళాయని నివేదికలు సూచిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి పాక్ ఆయుధ ఎగుమతులు $415 మిలియన్లకు పెరిగాయట. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 3,000% పెరుగుదల.
దేశీయ అవసరాలను మొదట తీర్చడానికి రూపొందించబడిన POF ప్రపంచవ్యాప్త డిమాండ్ తీర్చడానికి సిద్దమయ్యింది. ఈ క్రమంలో పాకిస్థాన్ వద్ద ఇప్పుడు ఆయుధ సంపత్తి తగ్గినట్లు తెలుస్తోంది.
ఫిరంగులు, సాయుధ యూనిట్లపై ఎక్కువగా ఆధారపడే పాకిస్తాన్ సైన్యంపై మందుగుండు సామగ్రి కొరత తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తగినంత మందుగుండు సామగ్రి లేకుండా భారత దాడిని తిప్పికొట్టడం పాక్ కు అసాధ్యం. కీలకమైన మందుగుండు సామగ్రి లేకపోవడం వల్ల పాకిస్తాన్ సైనిక వ్యవస్థ కొంతవరకు భయాందోళనకు గురవుతోందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. మే 2, 2025న జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఇతర అంశాలతో పాటు దీనిపై చర్చ జరిగిందట.
2022 నివేదిక ప్రకారం పాకిస్తాన్ రక్షణ ఎగుమతులు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. దిగుమతులు ($30.1 మిలియన్లు) ఎగుమతులను ($3.8 మిలియన్లు) అధిగమించాయి. ఈ క్రమంలో ఆయుధ నిల్వలను మరింతగా తగ్గించడం వల్ల పాకిస్తాన్ దుర్బలంగా మారింది. ముఖ్యంగా భారతదేశ ఆయుధ దిగుమతులు 2015-19 నుండి 2020-24 వరకు 61% పెరిగాయి, ఇది సామర్థ్య అంతరాన్ని సూచిస్తుంది.
ముందుగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఈ పరిమితులను అంగీకరించారు. భారతదేశంతో సుదీర్ఘ సంఘర్షణలో పాల్గొనడానికి పాకిస్తాన్ వద్ద మందుగుండు సామగ్రి, ఆర్థిక బలం లేదని పేర్కొన్నారు.
అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అప్పు, తగ్గుతున్న విదేశీ మారక నిల్వలతో కూడిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం సైన్యం యొక్క కార్యాచరణ సామర్థ్యాలను మరింత ప్రభావితం చేసింది. ఇంధన కొరత కారణంగా సైన్యం కేటాయింపులను తగ్గించవలసి వచ్చింది, ఆర్మీ రిక్రూట్ మెంట్ నిలిపివేయవలసి వచ్చింది.