
సింధూ నది జలాలను అడ్డుకునే ప్రాజెక్టులపై భారత్ చర్యలు చేపడితే, వాటిని క్షిపణులతో ధ్వంసం చేస్తామంటూ పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, తమ దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ఉపయోగించి సగం ప్రపంచాన్నే నాశనం చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీల సమావేశంలో చేయడం గమనార్హం.
మునీర్ మాట్లాడుతూ, "కశ్మీర్ మాకు ప్రాణంతో సమానం. అది భారత్లో భాగం కాదు, ఇంకా అంతర్జాతీయ చర్చలలో మిగిలిపోయిన అంశమే" అని పేర్కొన్నారు. నదీ జలాల ఒప్పందంపై విభేదాలను ప్రస్తావిస్తూ, "భారత్ డ్యామ్లు పూర్తిచేసే వరకు వేచి చూస్తాం, తర్వాత వాటిని పేల్చేస్తాం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అణు బెదిరింపులపై భారత విదేశాంగ శాఖ కఠినంగా స్పందించింది. "ఇలాంటి బెదిరింపులకు భారత్ భయపడదు. దేశ భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయం" అని స్పష్టం చేసింది. పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నందున, ఇది ప్రపంచానికి కూడా ముప్పు కావచ్చని హెచ్చరించింది.
అసీం మునీర్ అణు వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. "ఇలాంటి వ్యక్తికి అమెరికా ప్రభుత్వం ఎందుకు పదేపదే ఆహ్వానం ఇస్తోంది?" అని ప్రశ్నించింది. గత రెండు నెలల్లో మునీర్ ఇది రెండోసారి అమెరికా పర్యటన కావడం కూడా విమర్శలకు కారణమైంది.
మునీర్ వ్యాఖ్యలను భారత్ వక్రీకరించిందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. బలప్రయోగం ద్వారా బెదిరింపులను తమ దేశం సమర్థించదని పేర్కొంటూ, "మా సార్వభౌమత్వానికి, భౌగోళిక సమగ్రతకు ముప్పు వాటిల్లితే తగిన విధంగా ప్రతిస్పందిస్తాం" అని హెచ్చరించింది.