
వాషింగ్టన్ : కొత్తగా పెళ్లయిన ఓ జంటకు హనీమూన్ లో చేదు అనుభవం ఎదురయింది. జంటగా కలిసి మొదలుపెట్టిన జీవిత ప్రయాణాన్ని మధురానుభూతులతో నింపుకోవాలని.. అందమైన జ్ఞాపకాలతో ప్రయాణాన్ని మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ, ఓ పర్యాటక ఏజెన్సీ చేసిన పనితో వారికది జీవిత కాలపు భయంకర అనుభవంగా మిగిలిపోయింది. కొత్తగా పెళ్లయిన ఓ జంట హవాయి దీవులకు టూర్ కు వెళ్లాలని తమ హనీమూన్ ను ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం ఓ పర్యాటక ఏజెన్సీని సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే కొత్తజంటతో ఆ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకుంది.
కొత్త జంటను వారు కోరుకున్న హవాయి దీవులకు తీసుకువెళ్లారు.. ఆ తరువాత వారిని సముద్రం మధ్యలో వదిలేసి వెనక్కి వచ్చేశారు. చుట్టూ నీరు… అగాధపు లోతుల్లా కనిపించే సముద్రం. వారిపై ప్రాణాలుపైనే పోయాయి. ఎలాగో ఆ దంపతులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆ పర్యాటక ఏజెన్సీ చేసిన పని మీద మండిపడ్డారు. తమ ప్రాణాలతో చెలగాటమాడిన ఆ ఏజెన్సీ మీద కోర్టును ఆశ్రయించారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
తోషాఖానా కేసు: అరెస్టు వారంట్తో ఇమ్రాన్ ఇంటికి పోలీసులు, నిరసనలు
ఎలిజిబెత్ వెబ్ స్టర్, అలెగ్జాండర్ బర్కల్ లు కాలిఫోర్నియాకు చెందినవారు. 2021లో వీరికి వివాహమైంది. ఆ తర్వాత తమ హానీమూన్చ కోసం హవాయి దీవుల్లోని లనాయికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం ఇలాంటి ప్యాకేజీలు ప్రకటించే ఓ పర్యాటక ఏజెన్సీ ‘ సెయిల్ మౌయీ’ ని సంప్రదించారు. ఆ తర్వాత 2021 సెప్టెంబర్ లో హనీమూన్ టూర్ కి వెళ్లారు. ఆ ట్రిప్ లో భాగంగానే సముద్ర గర్భంలో స్నోర్కెలింగ్ కు వెళ్లారు. డైవింగ్ మాస్కులు, సిమ్ సూట్లు ధరించి వారు సముద్రంలోకి దూకేశారు.
అయితే, వీరితో పాటు పడవలో 44 మంది పర్యాటకులు ఉన్నారు. వీరితో సముద్రం మధ్యలోకి వెళ్లిన పడవ ఓచోట నిలిపారు. అక్కడ బోట్ కెప్టెన్ ఈతకు వెళ్లే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. కానీ ఎక్కడికి వెళ్లాలి, ఎంతసేపట్లో తిరిగి రావాలో.. వచ్చినా ఎక్కడికి రావాలో మాత్రం చెప్పలేదట. స్నోర్కెలింగ్ కు వెళ్లిన దంపతులు ఓ గంటసేపు హాయిగా సముద్ర గర్భంలో ఈత కొట్టిన తర్వాత.. సముద్రంలో ఏదో తేడా జరుగుతున్నట్లుగా వారికి అనిపించడంతో.. తాము ఎలాగైతే వచ్చారో అలాగే పడవలోకి చేరుకోవడం కోసం 15 నిమిషాల పాటు ఈదుకుంటూ పడవ ఆపిన ప్రదేశానికి చేరుకున్నారు.
అయితే, పడవ వీరికి అల్లంత దూరంలో కనిపించింది. అది తమను ఎక్కించుకోకుండానే.. తాము ఎక్కామో, లేదో చూసుకోకుండానే ఇంకా దూరం వెళ్లిపోవడం వారికి అర్థమయింది. ఎలాగో పడవలోకి చేరుకోవాలని వారు ఎంత ప్రయత్నించినప్పటికీ పడవవేగంతో వారు ఈదలేక పోయారు. ఇక అలా లాభం లేదనుకున్న ఆ జంట ప్రాణాలకు తెగించి సముద్రంలో ఈదడం మొదలుపెట్టారు. ఒడ్డు వరకు ఈదుకుంటూనే చేరుకోవాలని అనుకున్నారు. మధ్యలోకి వచ్చేసరికి తీవ్రంగా నీరసించి పోయారు. ఒంట్లోని సత్తవ కోల్పోయి ఇబ్బంది పడ్డారు.
ఆ సమయంలో ఐలాండ్ లో ఉండే ఓ వ్యక్తి వీరికి సహాయం చేశారట. ఈ ఘటన తమను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని, మానసిక వేదనను కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన టూర్ ఏజెన్సీ మీద చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడి కోర్టులో టూర్ ఏజెన్సీ మీద దావా వేశారు. అయితే ఏజెన్సీ నిర్వహణ లోపం వల్లే తమ ప్రాణాలకు ముప్పు కలిగించేలాంటి ఈ ఘటన జరిగిందని తమకు నష్టపరిహారంగా సుమారు 40 కోట్ల రూపాయలు ట్రావెల్ ఏజెన్సీ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.