
న్యూఢిల్లీ: టర్కీలో రద్దీగా ఉండే ఓ వీధిలో ఆదివారం పేలుడు సంభవించింది. రాజధాని నగరం ఇస్తాంబుల్లోని తాక్సిమ్ ఏరియాలో రద్దీగా ఉండే షాపింగ్ వీధి ఇస్తిక్లల్లో పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం ఆరుగురు మరణించారు. మరో 53 మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఉండే అవకాశాన్ని టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయ్యప్ ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యనే అని చెప్పడం ఒక వేళ తప్పు అవుతుందేమో అని చెబుతూనే.. కానీ, ఈ దాడి వెనుక ఉగ్రవాద వాసనలే వస్తున్నాయని తెలిపారు. ఈ పేలుడుకు పాల్పడ్డ దుండగులను వెతికి పట్టుకోవడానికి సంబంధిత యూనిట్లు రంగంలోకి దిగాయని వివరించారు.
ఈ ఘటన పై ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లికాయా ట్వీట్ చేశారు. దురదృష్టకరమైన ఈ పేలుడులో మరణాల సంఖ్య ఆరుకు చేరిందని, క్షతగాత్రులు 53 మంది అని వివరించారు.
పేలుడు సమయంలో అక్కడే ఉన్న ఓ సాక్షి సెమాల్ డెనిజ్కీ మాట్లాడుతూ, పేలుడుకు తాను 50 నుంచి 55 మీటర్ల దూరంలో ఉన్నారని వివరించారు. హఠాత్తుగా అక్కడ పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని తెలిపారు. ఆ వెంటనే వీధిలో నేలపై నలుగురు పడి ఉండటాన్ని చూశానని పేర్కొన్నారు. ప్రజలు భయంతో పరుగులు పెట్టారని తెలిపారు. ఆ చప్పుడు చాలా పెద్దగా ఉన్నదని అన్నారు.
సోషల్ మీడియాలో ఈ బ్లాస్ట్కు సంబంధించిన వీడియోలో వైరల్ అవుతున్నాయి. పేలుడు శబ్దం వెలువడగానే చాలా మంది దిక్కు చూడకుండా పరుగులు తీశారు.