
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఎయిర్ షోలో అపశృతి చేటుచేసుకుంది. డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో శనివారం జరిగిన ఎయిర్షోలో చారిత్రాత్మక యుద్ద విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. టెక్సాస్లోని డల్లాస్ నగరంలో జరిగిన ఎయిర్ షోలో ఈ సంఘటన జరిగింది.
ఈ ఎయిర్ షోలో రెండు ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించిన బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ P-63 కింగ్కోబ్రా విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అధికారులు ప్రాణనష్టాన్ని ధృవీకరించలేదు. కానీ, పలు అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ప్రమాద సమయంలో ఆరుగురు వ్యక్తులు విమానంలో ఉన్నారనీ, వారందరూ చనిపోయి ఉండవచ్చని అంచనా.
విమాన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలలో విమాన శకలాలు ఒకే చోట పడి ఉన్నాయని, కార్మికులు శిధిలాలను తొలగిస్తున్నట్లు చూడవచ్చు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటన ప్రకారం.. బోయింగ్ B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్, బెల్ P-63 కింగ్కోబ్రా విమానాలు మధ్యాహ్నం 1:20 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢీకొని కూలిపోయాయి. స్మారక ఎయిర్ ఫోర్స్ వింగ్స్ ఓవర్ డల్లాస్ షో సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించింది.
ఈ ప్రమాదంపై డల్లాస్ మేయర్ ఎరిక్ జాన్సన్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు హృదయ విదారకంగా ఉన్నాయని అన్నారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ స్థానిక పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని మేయర్ తెలిపారు.
రెండో ప్రపంచ యుద్ద నాటి విమానాలు
కింగ్కోబ్రా అనేది ఒక అమెరికన్ యుద్ధ విమానం. ఈ విమానాలను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ దళాలు ఎక్కువగా ఉపయోగించాయి. B-17 అనేది యుద్ద విమానాలను 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీకి వ్యతిరేకంగా జరిగిన దాడులలో US వైమానిక దళం ఉపయోగించింది. వీటిలో నాలుగు ఇంజిన్ బాంబర్ ఉంటాయి. బోయింగ్ కంపెనీ ప్రకారం.. చాలా B-17 విమానాలు రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో స్క్రాప్ చేయబడ్డాయి. ఎయిర్ షోలలో లేదా మ్యూజియంలలో ప్రదర్శించబడే వాటిలో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి.