
Insider Trading: ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి పది లక్షల డాలర్లకు పైగా అక్రమంగా ఆర్జించిన ఆరోపణలపైన భారత సంతతికి చెందిన ఏడుగురు టెకీలపై అమెరికాలో కేసు నమోదైంది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫిర్యాదు మేరకు ఫెడరల్ అధికారులు ఈ మేరకు అభియోగాలు నమోదుచేశారు. రెండేళ్ల క్రితం వీరు ఈ మోసానికి పాల్పడగా.. తాజాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మార్చి-మే 2020లో వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా వీరు ఈ మోసానికి పాల్పడ్డారు.
వివరాల్లోకెళ్తే.. భారత సంతతికి చెందిన హరి ప్రసాద్ సూరి, లోకేశ్ లగుడు, చోటు ప్రభుతేజ్ శాన్ ముగ్గురు స్నేహితులు. శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న "ట్విలియో" క్లౌడ్ కంప్యూటింగ్ కమ్యునికేషన్స్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. 2020లో ఈ ముగ్గురు స్నేహితులు ట్విలియో కంపెనీ రెవెన్యూకు సంబంధించిన డేటా బేస్ లను యాక్సెస్ చేసి.. కంపెనీ కస్టమర్ల సమాచారాన్ని తెలుసుకున్నారు. కొవిడ్ సమయంలో ట్విలియో కంపెనీ ఉత్పత్తులు, సేవల వినియోగం ఆశాజనకంగా ఉంటుందని తెలుసుకొన్నారు.
అంతటితో ఆగకుండా.. రహస్య సమాచారాన్ని మిత్రుడు దిలీప్ రెడ్డికి చేరవేశాడు. అలాగే లోకేశ్ కూడా తన గర్ల్ఫ్రెండ్తో పాటు మరో స్నేహితుడు అభిషేక్కు కంపెనీ విషయాలు చెప్పాడు. ప్రభుతేజ్ తన సోదరుడు చేతన్ ప్రభుకు కూడా ఈ విషయాలను వెల్లడించాడు.
అలా ఫలితాల ప్రకటన వచ్చే ముందే బ్రోకరేజ్ ఖాతాల ద్వారా ట్విలియో ఆప్షన్లు, స్టాక్స్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. వారి భావించినట్టుగానే.. 2020 మే 6న ట్విలియో త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన అనంతరం కంపెనీ షేర్లు అమాంతం పెరిగిపోయాయి. దీంతో వీరంతా లాభాల బాట పట్టారు. అయితే అనుమానం వచ్చిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసం ఈ ఏడుగురు ఓ ప్రైవేటు చాట్ ఛానల్ ను రూపొందించుకుని, ట్విలియోకు సంబంధించిన ట్రేడింగ్, షేర్లు వివరాలన్నింటిని గురించి అందులో తెలుగులో మాట్లాడుకున్నట్లు తేలింది. తద్వారా ఈ ఏడుగురు 7.5 కోట్లు అక్రమంగా అర్జించినట్టు దర్యాప్తులో తేలింది.