భారత పర్యటనను మర్చిపోలేకపోతున్న డోనాల్డ్ ట్రంప్: ఏమన్నాడంటే...

By telugu teamFirst Published Mar 1, 2020, 1:17 PM IST
Highlights

భారత దేశంలో అలా లక్ష మంది పైచిలుకు జనాలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత తాను ఇక ఎప్పుడు సభల్లో ఎంతమంది జనాలు ఉన్నారో అనే విషయం గురించి పట్టించుకోనని అన్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడప్పుడు భారత పర్యటన అనుభవాలను మర్చిపోయేలా లేదు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీని గొప్ప వ్యక్తిగా అబివర్ణిస్తూ... భారత పర్యటన విలువైనదని అభిప్రాయపడ్డాడు. 

భారత దేశంలో అలా లక్ష మంది పైచిలుకు జనాలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత తాను ఇక ఎప్పుడు సభల్లో ఎంతమంది జనాలు ఉన్నారో అనే విషయం గురించి పట్టించుకోనని అన్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 

సహజంగానే ట్రంప్ కి భారీ సభలన్నా, పెద్ద గుంపును ఉద్దేశించి మాట్లాడడమన్న చాలా ఇష్టం. అలా ట్రంప్ అమెరికాలోని ఒక సభలో మాట్లాడుతూ... భారత్ లో జరిగిన సభ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. 

Also read: మిత్రుని కోసం మెనూ మార్చిన మోడీ: రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ భోజనమిదే..!!

150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అంతమంది జనాలు సభకు వచ్చినప్పుడు, అంతకన్నా తక్కువ జనాభా కలిగిన మనదేశంలో ఇంత మంది సభకు రావడం కూడా గొప్ప విషయమేనని అన్నాడు. 

భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రస్తావిస్తూ ఆయన భారతదేశంలో అత్యంత ఆదరణీయ వ్యక్తని, ప్రజలకు అతనెంతో ప్రియతమా నేతని ట్రంప్ అన్నాడు. భారతదేశ పర్యటన చాలా అనుభవాలను మిగిల్చిందని ట్రంప్ సంతోషం వ్యక్తం చేసాడు. 

డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత దేశంలో ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో పర్యటించిన విషయం తెలిసిందే.   ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలేనియ ట్రంప్, కూతురు ఇవాంక, జారెడ్ కుష్ణర్ లతో కూడిన బృందం నేరుగా వాషింగ్టన్ నుండి బయల్దేరి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. 

విమానాశ్రయం నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమం చేరుకున్న ట్రంప్... అక్కడ గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించి రాట్నం కూడా తిప్పారు. మూడు కోతుల బొమ్మను చూసి ముగ్ధుడయ్యాడు ట్రంప్. 

Also read: భారత పర్యటనలో ఇవాంక గ్లామర్: ట్విట్టర్ లో ఫొటోలు

అక్కడి నుండి అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొన్నారు. భారత్, అమెరికాల మైత్రి లో నూతన అధ్యాయం ఆరంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ గొప్పతనాన్ని, మోడీ ఔచిత్యాన్ని పదే పదే ప్రస్తావిస్తూ... భారత్ అమెరికాకు మంచి మిత్ర దేశమని ఘంటాపథంగా తెలిపారు. 

అక్కడి నుండి ఆయన తాజ్ మహల్ సందర్శనానికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడ ట్రంప్ కి స్వాగతం పలికారు. ఆగ్రా ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి తాజ్ మహల్ చేరుకున్న ట్రంప్ బృందం అక్కడ దాదాపుగా గంటసేపు గడిపారు. 

అక్కడి నుండి రాత్రి ఢిల్లీ లోని మౌర్య షెరటాన్ హోటల్ కి బయల్దేరి వెళ్లారు. తర్వాతి రోజు భారత్ తో అనేక ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటుగా అనేక కంపెనీల ప్రతినిధులతో కూడా మాట్లాడారు. ఆ తరువాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే స్టేట్ డిన్నర్ కి హాజరయి రాత్రికి అమెరికా బయల్దేరి వెళ్లారు.  

click me!