eKYC: ఈకేవైసీ చేయించుకున్నారా... ఒక్కరోజే గడువు.. లేదంటే నష్టపోతారు! 

 

 

 

 

 

 

Google News Follow Us

రేష‌న్ కార్డుదారులంద‌రికీ ఈకేవైసీ న‌మోదు తప్పనిసరి అని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈకేవైసీ నమోదుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఏపీలో ఇటీవల పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రిత్వ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపిన ప్రకారం మరో 3 శాతం మంది లబ్దిదారులకు మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. వారి వివరాలు కూడా సచివాలయాల వారీగా సేకరించి, అవసరమైతే అధికారులను వారి ఇళ్లకు పంపి కేవైసీ నమోదు చేయిస్తున్నట్లు ప్రకటించారు. 

రాష్ట్ర ప్రభుత్వం తొలుత మార్చి 31వ తేదీలోగా ఈకేవైసీ చేసుకోక‌పోతే, ఏప్రిల్ నుంచి రేష‌న్ రాదని ప్రక‌టించింది. అందుక‌నుగుణంగా మార్గద‌ర్శకాలు కూడా విడుద‌ల చేసింది. అయితే ఈకేవైసీ న‌మోదు న‌త్తన‌డ‌క‌గా జ‌ర‌గ‌డం, న‌మోదులో సాంకేతిక స‌మ‌స్యలు రావ‌డం, అలాగే ఈకేవైసీ చేసేందుకు సిబ్బంది కొర‌త, ప‌ర్యవేక్షించే ఎంఎస్‌వోల‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల విధులు అప్పగించ‌డం వంటి కార‌ణాల‌తో ఈకేవైసీ న‌మోదు పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రజల డిమాండ్లు, విజ్ఞప్తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు ఏప్రిల్‌ 30 వరకు గ‌డువు పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది. 

ఈ మేర‌కు రాష్ట్ర ఆహార‌, పౌర స‌ర‌ఫ‌రాల మంత్రిత్వ శాఖ క‌మిష‌న‌ర్ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈకేవైసీని పూర్తి చేయాల‌ని అన్ని జిల్లాల క‌లెక్టర్లు, అన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌వో) చర్యలు చేపట్టారు. ఈ-పోస్ పరికరాలు, గ్రామ స‌చివాల‌య‌, వార్డు స‌చివాల‌య‌ మొబైల్ యాప్ ద్వారా రేష‌న్ లబ్ధిదారుల ఈకేవైసీని దాదాపు పూర్తి చేశారు. ఈక్రమంలో ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోని వారు ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరో రెండు రోజులే అవకాశం ఉందని సచివాలయాలు, రేషన్‌ దుకాణదారులను సంప్రదిస్తే నమోదు చేస్తారని అధికారులు చెబుతున్నారు.

ఇలా నమోదు చేసుకోవచ్చు.. 
ఎఫ్‌పీ షాప్ డీలర్ లాగిన్, తహసీల్దార్ లాగిన్, డీసీఎస్‌వో లాగిన్, కలెక్టర్ లాగిన్‌ల‌లో ఈకేవైసీపీ యూనిట్లు అందుబాటులో ఉంచారు. గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం (జీఎస్‌డ‌బ్ల్యూఎస్‌) మొబైల్ యాప్, ఎఫ్‌పీ షాపుల్లో ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌వో)లు ఫీల్డ్ అధికారులకు తగిన సూచనలు చేశారు. లబ్ధిదారులు (5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా) గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం మొబైల్ యాప్ లేదా ఈ-పీవోఎస్‌ పరికరాల ద్వారా ఈకేవైసీపీ ప్రక్రియను పూర్తి చేయాల‌ని చెబుతున్నారు. ఈకేవైసీ చేయకపోతే, కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

Read more Articles on