చార్మినార్ అగ్ని ప్ర‌మాదంలో 16కి పెరిగిన మృతుల సంఖ్య‌.. చ‌నిపోయిన వారి వివ‌రాలివే

Narender VaitlaUpdated : May 18 2025, 12:20 PM IST

హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తొలుత 8 మంది మ‌ర‌ణించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే కాలం గ‌డుస్తోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌తో తీవ్ర విషాదం నెల‌కొంది.   

హైదరాబాద్‌లోని చార్మినార్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఉన్న ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 

తెల్లవారు జామున సుమారు 6 గంటల సమయంలో మంటలు మొదలైనట్లు అధికారులు తెలిపారు. భవనం మొదటి అంతస్తులో మంటలు ప్రారంభమయ్యాయి. ప్రమాద సమయంలో భవనంలో చాలామంది ఉండటంతో, కొంతమందికి ఊపిరి ఆడక స్పృహ తప్పిపోయారు. వారిని వెంటనే ఉస్మానియా, మలక్‌పేట యశోద, డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రులకు తరలించారు. అందులో కొంతమంది అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ప్ర‌మాదానికి కార‌ణం: 

ప్రమాదానికి ప్రధాన కారణంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మంటల వ్యాప్తి వేగంగా జరిగి పై అంతస్తులకు కూడా చేరింది. దీంతో సహాయ చర్యలు తక్షణమే ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 

ఘటన చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక, DRF, GHMC, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మిగిలిన వారిని రక్షించి బయటకు తీసుకువచ్చారు. మంటలతో గుల్జార్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. 

ఈ ఘటనలో మృతి చెందిన 16 మందిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు.

మృతుల వివరాలు ఇలా ఉన్నాయి:

రాజేంద్ర కుమార్ (67)

అభిషేక్ మోదీ (30)

సుమిత్ర (65)

మున్నీబాయి (72)

ఆరుషి జైన్ (17)

శీతల్ జైన్ (37)

ఇరాజ్ (2)

హర్షాలీ గుప్తా (7)

రజని అగర్వాల్

అన్య మోదీ

పంకజ్ మోదీ

వర్ష మోదీ

ఇద్దిక్కి మోదీ

రిషభ్

ప్రథమ్ అగర్వాల్

ప్రాంశు అగర్వాల్

రేవంత్ దిగ్భ్రాంతి: 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

ఇక కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి కూడా గుల్జార్ హౌస్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యల్లో ఆలస్యం జరిగిందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. చిన్న స్థాయి ప్రమాదమైనా ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు. అగ్నిమాపక శాఖకు ఆధునిక సాంకేతికత అందించడం ద్వారా ఇలాంటి ఘటనలు నివారించవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Read more Articles on
click me!