కాలేజీ వెళుతున్న విద్యార్థులను వేధిస్తున్న ఓ ఆకతాయికి తగిన బుద్ది చెప్పారు ఈ అమ్మాయిలు. తమ వెంటపడుతూ వేధిస్తున్న పోకిరీకి ఏమాత్రం భయపడకుండా పోలీసులకు పట్టించి తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోండామార్కెట్ ప్రాంతంలో కేశవ్ అనే వ్యక్తి బేల్పురి విక్రయిస్తుంటాడు. ఇతడు తరచూ ఇదే దారిలో వెళ్లే అమ్మాయిలను వేధించేవాడు. ఎప్పటిలాగే చిలకలగూడ చౌరస్తా వైపు నుంచి కాలేజీకి వెళ్లేందుకు వస్తున్న ఇద్దరు విద్యార్థినులను వేధించాడు. ఇతడు వెంటపడుతున్నా ఏమాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించిన విద్యార్థినులు రామకృష్ణ హోటల్ చౌరస్తా వద్ద విధుల్లో వున్న ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ కు ఈ విషయం తెలిపారు. దీంతో అతడు ట్రాఫిక్ పోలీసులకు ఈ విషయం తెలుపగా అక్కడే వున్న ట్రాఫిక్ ఎస్సై కనకయ్య తన సిబ్బందితో కలిసి కేశవ్ ను పట్టుకున్నారు. అతడిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని గోపాలపురం పోలీసులకు అప్పగించారు.