బస్టాప్లో వేచివున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి షీ టీమ్ పోలీసులకు చిక్కాడో పోకిరీ. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం. 1 లోని ఫించన్ ఆఫీస్ బస్టాప్ లో జరిగింది. పోకిరీ యువకుడి వేధింపులకు బయపడకుండా యువతి రహస్యంగా తన మొబైల్ లో వీడియో తీసి షీ టీమ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం బైటికొచ్చింది.
వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ రోడ్డు నం.1లో విరించి ఆసుపత్రి సమీపంలోని ఓ సంస్థలో యువతి ఉద్యోగం చేస్తున్నారు. విధుల అనంతరం ఇంటికి వెళ్లేందుకు రోజూ సాయంత్రం పింఛను కార్యాలయం ముందు బస్సు కోసం వేచి చూసేవారు. అయతే ఈమె ఒంటరిగా ఉండడాన్ని కొన్ని రోజుల నుండి గమనిస్తున్న టప్పాచబుత్రకు చెందిన ఎండీ అబ్దుల్ (30) లిప్ట్ ఇస్తానంటూ వేధించడం మొదలుపెట్టాడు. తన బైక్ పై ఎక్కాలంటూ, మొబైల్ నంబర్ ఇవ్వాలంటే వేధించడంతో విసుగుచెందిన యువతి ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి షీ టీమ్ పోలీసులకు వాట్సాఫ్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ బైక్ నంబర్ ను బట్టి వేధింపులకు పాల్పడిన అబ్దుల్ ను గుర్తించిన పోలీసులు అదే బస్టాప్లో అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తరలించారు.