
ఎలాగైనా సొంత రాష్ట్రం గుజరాత్ తో కాషాయజెండా ఎగరవేయాలని ప్రధాని మోదీ పట్టుదలతో ఉన్నాడు. అందుకు సెక్యూరిటీ రీజన్స్ ను కూడా కాదని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. గుజరాత్ లో రెండవ విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసందర్భంగా మోదీ అహ్మదాబాద్ లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే శాంతిభద్రతల దృష్ట్యా గుజరాత్ పోలీసులు ప్రధాని రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి అనుమతి నిరాకరించారు. ప్రధాని రోడ్డు ప్రయాణం వల్ల శాంతిభద్రతలతో పాటు ఆయన భద్రతకు కూడా ముప్పు ఉందంటూ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఎలాగైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న ఉద్దేశ్యంతో ప్రధానికి ఓ కొత్త ఆలోచనతో ముందుకువెళ్లారు. రోడ్డు మార్గాన కాకుండా సీప్లేన్ లో సబర్మతి నదిలో ప్రయాణించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి చేరుకున్నారు. మోదీ సబర్మతి నదిలో అహ్మదాబాద్ నుంచి ధారోయ్ డ్యామ్ వరకు ఈ సీప్లేన్లో ప్రయాణించారు. అక్కడి నుంచి నేరుగా అంబాజీ టెంపుల్కు రోడ్డు మార్గాన చేరుకుని దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొంటారు.
ఇలా మోదీ సీప్లేన్ లో ప్రయాణించడం మొదటిసారి కావడం విశేషం. అయితే ప్రధాని నదిలో ప్రయాణిస్తున్నపుడు నదీతీరం వెంట భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు, అభిమానులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. బీజేపిని మరోసారి గుజరాత్ లో అధికారంలోకి తేవాలన్న ప్రధాని తపనను చూసి బీజేపి కార్యకర్తలు ఫిదా అవుతున్నారు.