
అమరావతికి ఇంతవరకు మెట్రోరైలే వస్తుందనుకున్నాం. కానీ ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటి జాబితాలోచేర్చేందుకు ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. అమరావతినుంచి తిరుపతికి 25 నిమిషాల్లో, విశాఖకు 23నిమిషాల్లో ప్రయాణికులను చేర్చే రవాణా వ్యవస్థను రాజధానికి తీసుకురావాలనుకుంటున్నారు. దానితో మెట్రో చిన్నదైపోతుంది. మెట్రో రైలును మించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత వేగంతో కూడిన రవాణా వ్యవస్థను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేలా అధ్యయనం జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవస్థయే హైపర్ లూప్.
ప్రపంచంలో ఇంతవరకు ఈ రకం రైలు ఇంకా చుక్ చుక్ అనలేదెక్కడా. అయితే, చంద్రబాబు నాయుడు అమరావతి అంతర్జాతీయ రంగులద్దేందుకు గ్లోబల్ కంపెనీలకు పూలబాట వేస్తున్నందున తానొక రాయి వేద్దామని హైపర్ లూప్ వన్ అనే సంస్థ భావిస్తున్నది.హైపర్లూప్ వ్యవస్థ విశేషాలను బుధవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రికి ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.
హైపర్లూప్ రైలు వస్తే అమరావతి నుంచి హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నయ్కు కూడా విమానం కన్నా వేగంగా రైల్లోనే తొందరగా చేరుకోవచ్చు.
హైపర్ లూప్ రవాణా వ్యవస్థ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు సిద్ధంగా వున్నామని, పరిశోధనా కేంద్రాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తామని హైపర్ లూప్ వన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.