జగన్ కు తమ గోడు వినిపించిన గ్రూప్-1 అభ్యర్థులు

First Published Nov 16, 2017, 3:47 PM IST
Highlights
  • పాదయాత్రలో వున్న జగన్ ను కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు
  • తమ తరపున నిలబడాలని విన్నపం
  • న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన జగన్

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన వైసిపి అధినేత జగన్ ను 2011 గ్రూప్-1 అభ్యర్దులు కలుసుకున్నారు. తమ సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించడం లేదని, మీరే మా తరపున పోరాడాలని జగన్ ను కోరారు. ఇవాళ ఉదయం ఆళ్లగడ్డ నుంచి యాత్ర ప్రారంభించిన జగన్ ను కలుసుకున్న అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి ఉందని వివరించారు.
2011 నుంచి తాము ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పుకు తాము రెండోసారి పరీక్ష రాసామని అన్నారు. అందులో కూడా అర్హత సాధించామని అయినా ప్రభుత్వం ఫలితాలు,పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని వాపోయారు. నోటిపికేషన్ టైమ్ లో మాత్రం నెల రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, కానీ పరీక్ష ముగిసి ఏళ్లు గడుస్తున్నా అసలు ఫలితాల ఊసే లేదని అన్నారు.
దీనిపై స్పందించిన జగన్ ఎన్నికల సమయంలో బాబు వస్తేనే జాబ్ వస్తుందని ప్రచారం చేసుకుని, ఇపుడు నిరుద్యోగులను నట్టేట ముంచుతారా అని  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఈ గ్రూప్ 1 అభ్యర్ధుల విషయాన్ని ఏపీపీఎస్సీ సెక్రటరీ దృష్టికి తీసుకు వెళ్లి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 

click me!