నిన్నగద్వాల్ బహిరంగ సభలో కాంగ్రెస్ కు సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్ కు దీటుగా జవాబిచ్చారు స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ. కేటీఆర్ యువకుడు, ఉడుకు రక్తం గలవాడు కాబట్టి వాళ్ల నాన్న కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అయితే దళితులను సీఎంగా చేస్తానని మాటిచ్చి, అధికారంలోకి రాగానే మాట తప్పిన అతని తండ్రి లాగే ఇతను కూడా మాట తప్పే బాపతేనని అన్నారు అరుణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేటీఆర్ మాటలు నమ్మలా,కేసీఆర్ మాట నమ్మలా? అంటూ ప్రశ్నించారు.
కేటీఆర్ మాటలను తాము పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందన్నారు. టీఆరెస్ పార్టీ తలకిందులు తపస్సు చేసినా రాబోయే రోజుల్లో అధికారంలోకి రాదని, వారి అపజయ యాత్ర గద్వాల్ నుండే ప్రారంభమైందని విమర్శించారు డీకె అరుణ.