
ఆధార్ డేటా చోరీ చేసిన కేసులో పోలీసులు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని అరెస్టు చేశారు. కాగా.. అతను దొంగతం చేసిన విధానాన్ని తెలుసుకొని పోలీసులు ఖంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే.. ఖరగ్పూర్ ఐఐటీలో చదివిన 31 ఏళ్ల అభినవ్ శ్రీవాత్సవ్ అత్యంత రహస్యమైన ఆధార్ డేటాను దొంగలించాడు. కార్త్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన శ్రీవాత్సవ్ ఆధార్ యాప్ను సృష్టించి డేటాను చోరీ చేశాడు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అతను చోరీ చేసిన విధానాన్ని పోలీసులకు ఆరుగంటల పాటు ప్రజంటేషన్ ద్వారా తెలియజేశాడు. అదంతా చూసి పోలీసులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అతనిచ్చిన ప్రజంటేషన్ ని పోలీసులు వీడియోలో రికార్డు చేశారు.
ప్రస్తుతం నిందితుడు శ్రీవాత్సవ్ ఏఎన్ఐ టెక్నాలజీస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆధార్ ఈ-కేవైసీ అనే యాప్తో ఈ ఏడాది జనవరిలో ఆధార్ సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్లో తన యాప్ను పెట్టిన అతను అక్రమంగా డేటాను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. టెకీ శ్రీవాత్సవ్ మొత్తం అయిదు యాప్లను సృష్టించాడు. వాటిల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా సుమారు 50 వేలు సంపాదించాడు. అయితే యాప్లతో ఇంకా ఏవైనా రూల్స్ను అతిక్రమించాడా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. సుమారు 50 వేల సార్లు ఆధార్ ఈకేవైసీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయినట్లు తెలుస్తున్నది. తాను క్రియేట్ చేసిన యాప్తో యూఐడీఏఐ సర్వర్లను అక్రమంగా యాక్సెస్ చేశాడు. అక్కడ నుంచి ఆధార్ సమాచారాన్ని చోరీ చేశాడు.