
కరోనా మహమ్మారి ప్రజలను ఎంతలా భయపెడుతుందో అందరికీ తెలుసు. ఇప్పటికే ఎక్కడ చూసినా ఈ కరోనా మహమ్మారి పేరే వినపడుతోంది. ప్రతిరోజూ 3లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్ గా తేలుతోంది. కాగా.. ఇప్పటి వరకు మనకు కరోనా లక్షణాలపై అవగాహన ఉంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, రుచి కోల్పోవడం, వాసన కోల్పోవడం వంటివి కరోనా లక్షణాలుగా చెబుతూ వచ్చారు. తాజాగా ఈ జాబితాలోకి మరోటి కూడా వచ్చి చేరింది. ప్లేట్ లెట్లు కోల్పోవడం కూడా కరోనా లక్షణమేనని నిపుణులు చెబుతున్నారు.
తీవ్ర నీరసం, రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య ఒక్కసారిగా భారీగా తగ్గిపోవడం కూడా కరోనా ఇన్ఫెక్షన్ ప్రాథమిక లక్షణంగా భావించాల్సి ఉంటుందని ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా లక్షణాలతో తమ వద్దకు వచ్చిన ఎంతోమందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వారు అంటున్నారు. తీవ్ర నీరసం, రక్తంలో ప్లేట్లెట్లు పడిపోవడాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకుంటే.. తర్వాతి దశలో జ్వరం, శ్వాస తీసుకునే సమస్యలు కూడా చుట్టుముడుతాయని హెచ్చరిస్తున్నారు.
వైద్యుల కథనం ప్రకారం.. నీరసంగా అనిపించడంతో ఈనెల 18న ఓ వ్యక్తి రక్తపరీక్ష చేయించుకోగా ప్లేట్లెట్లు 4.5 లక్షల నుంచి 85వేలకు తగ్గిపోయినట్లు గుర్తించారు. దీంతో వైద్యుడి రాసిచ్చిన మందులను వాడుతుండగా ఏప్రిల్ 23న శ్వాస సమస్య కూడా మొదలైంది. అనుమానంతో అతడు మరోసారి రక్తపరీక్ష చేయించుకోగా ప్లేట్లెట్లు 20వేలకు పడిపోయినట్లు వెల్లడైంది. ఈ పరిణామంతో మేల్కొన్న బాధిత కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రుల్లో చేర్పించే ప్రయత్నం చేయగా.. ఆక్సిజన్ బెడ్లు లేవంటూ ఎక్కడా చేర్చుకోలేదు. ఇలా వైద్యసహాయం కోసం ఎదురుచూస్తూనే అతడు చనిపోయాడని కుటుంబీకులు చెప్పారు.