నారా లోకేశ్ కుట్రలు... జగన్ భద్రతకు ముప్పు: పోలీసులకు వైసిపి నేత ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Nov 29, 2019, 2:53 PM IST
Highlights

గురువారం టిడిపి అధినేత చేపట్టిన అమరావతి పర్యటన వెనుక పెద్ద కుట్ర దాగివుందని వైసిపి  నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు హాని తలపెట్టే కుట్రలు జరుగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

తుళ్లూరు: టిడిపి నాయకులు చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటనలో పెద్ద కుట్ర దాగివుందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండానే డ్రోన్ కెమెరాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే సచివాలయం, అసెంబ్లీ ప్రాంతాల్లో ఉపయోగించారని... దీనివల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రుల భద్రతకు ముప్పు వుందని ఆరోపిస్తున్నారు. 

ఈ మేరకు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరికొందరు వైసిపి నాయకులు తుళ్లూరు డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఐటీ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోనే ఈ కుట్ర జరిగినట్లు... ఆయన వల్లే ముఖ్యమంత్రి జగన్ కు ప్రమాదం పొంచి వుందని పిర్యాదులో పేర్కొన్నారు. ఈ కుట్రలను చేధించి ఎలాంటి ప్రమాదం జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైసిపి నేతలు పోలీసులను కోరారు. 

టిడిపి నాయకులు మాత్రం అమరావతి పర్యటనలో చంద్రబాబు నాయుడికి భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. జడ్ ప్లస్ భద్రత కలిగిన ఆయనపై రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో వైసిపి కార్యకర్తలు దాడులకు దిగారని  అన్నారు. వీటినుండి కాపాడాల్సిన పోలీసులే తాము  ప్రయాణిస్తున్న వాహనంపై లాఠీలు విసిరారని టిడిపి శాసనసభాపక్ష ఉపనేత అచ్చెంనాయుడు ఆరోపించారు. 

ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికి‌ చూపించాలనే తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనను చేపట్టినట్లు అచ్చెంనాయుడు పేర్కొన్నారు. ఇలా రాష్ట్ర సంక్షేమంకోసం పర్యటిస్తున్న సమయంలో ఆయన వాహనంపై చెప్పులు, రాళ్లతో దాడి‌ చేయడం సిగ్గుచేటని... ఈ ఘటనను టిడిపి శాసనసభా పక్షం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.

read more  రైతులు కాదు... చంద్రబాబుపై దాడిచేసింది పోలీసులే..: అచ్చెంనాయుడు

జడ్ ప్లస్ భద్రత లో ఉన్న చంద్రబాబు పై జరిగిన దాడికి సిఎం జగన్, డిజిపి సవాంగ్ లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  గురువారం నాటి డిజిపి ప్రకటన‌ను చూసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. 

తమ పర్యటనకు పోలీసుల అనుమతి వుందని కాబట్టి  పూర్తిస్థాయి భద్రత కల్పించాల్సిన బాధ్యత వారిపైనే వుంటుందన్నారు. కానీ పోలీసులే తమ బస్సుపై లాఠీ   విసిరినట్లు అచ్చంనాయుడు ఆరోపించారు. అలా  తమ వాహనంపై లాఠీలు వేసింది ఎవరో డిజిపి చెప్పాలని డిమాండ్ చేశారు. 

తమపై రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడులు చేశారని చెబుతున్నారని అన్నారు. ఒకవేళ రాజధాని ప్రాంత ప్రజలకు ఆగ్రహం ఉంటే తాము పర్యటించిన అన్ని‌చోట్లా దాడులు జరగాలి కానీ ఒక్క సెంటర్ ను‌ ఎంచుకుని అక్కడే దాడి‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆ ఒక్కచోట తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోప్రజలు తమకు సాదర స్వాగతం పలికారన్నారు.

read more  చంద్రబాబు ఓ నీచుడు...అందుకే చెప్పులతో స్వాగతం..: కొడాలి నాని

భావ స్వేచ్చ అందరికీ ఉంటుందని డిజిపి అంటున్నారని... ఆయన అన్నట్లుగానే నిరసనకు అవకాశం ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఇకపై కూడా  అందరికీ ఇదే విధంగా నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని... సీఎం జగన్ పర్యటనలో కూడా తాము నిరసనలు తెలుపుతామన్నారు. అప్పుడు డిజిపి తమ నిరసనకు అనుమతి ఇవ్వకపోతే ఆయన్ని వైసిపి కార్యకర్తగా పరిగణిస్తామన్నారు. 

మంత్రి బొత్సా సత్యనారాయణ పక్కన అనువాదకుడిని పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. టిడిపి ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబుపై దాడి ఘటనను పార్లమెంటు లో కూడా ప్రస్తావిస్తామని అచ్చంనాయుడు వెల్లడించారు. 

 


 

click me!