వివేకా హత్యకేసులో వెనక్కితగ్గిన జగన్... మా అనుమానాలివే..: వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Feb 7, 2020, 7:40 PM IST
Highlights

వైఎస్ వివేకా హత్య కేసును సిబిఐకి అప్పగించాలని గతంలో కోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్ ఇప్పుడు ఆ పిటిషన్ ను వెనక్కితీసుకోవడం వెనుక అంత:పుర రహస్యం దాగుందని వర్ల రామయ్య పేర్కోన్నారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుని సీబీఐకి అప్పగించాలంటూ గతంలో కోర్టులో పిటిషన్‌ వేసిన జగన్ ఇప్పుడెందుకు దానిని ఉపసంహరించుకున్నాడో  సమాధానం చెప్పాలని టిడీపీ సీనియర్‌ నేత, పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య డిమాండ్‌ చేశారు. 

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని, ఆనాడు హత్యకేసు విచారిస్తున్న పోలీసుల తీరుని తప్పుబట్టిన జగన్‌ రాష్ట్ర గవర్నర్‌ని కలిసి ప్రభుత్వ దర్యాప్తుపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గవర్నర్‌ని కలిశాక మార్చి 22-2019లో హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూపిటిషన్‌ వేశారని... అదే రోజు వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్య కూడా పిటిషన్‌ వేశారన్నారు. 

read more  ఆస్తుల కేసులో కోర్టుకు గైర్హాజర్: వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు

హత్యకేసు విచారణకు ఆనాడు చంద్రబాబునాయుడు అడిషనల్‌ డైరక్టర్‌ స్థాయి వ్యక్తి ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగన్‌ ముఖ్యమంత్రయ్యాక హత్యకేసుని సీబీఐకి అప్పగించకుండా గతంలో చంద్రబాబు నియమించిన అధికారులతోనే మరోసారి సిట్ ను ఏర్పాటు చేశారన్నారు. వివేకా కుమార్తె సునీత, తనకు  తన భర్తకు ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌కు లేఖ రాశారని, అప్పుడు  కూడా జగన్‌ కేసు గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. 

వివేకా హత్యకేసులో జగన్‌, సౌభాగ్యమ్య వేసిన పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే, సునీత  కూడా ఇటీవలే పిటిషన్‌ వేసిందన్నారు. మార్చి 22, 2019న వేసిన తన పిటిషన్‌ను జగన్‌ ఎందుకు ఉపసంహరించుకున్నాడని రాష్ట్ర  ప్రజానీకమంతా ఆలోచిస్తోందని వర్ల తెలిపారు.  

అంత:పుర రహస్యాలు బయటపడతాయనేనా...?

అంత:పుర రహాస్యాలు బయటపడతాయన్న భయంతోనే జగన్‌ తన  పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడని... తనకు కావాల్సినవారు, అనుంగు మిత్రులు, శిష్యులు  బయటపడతారనే  భయంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని వర్ల ఆరోపించారు. హైకోర్టు పిటిషన్‌ ను విచారణకు తీసుకునే సమయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రప్రజానీకం ఉలిక్కిపడిందన్నారు. 

ఇదివరకు వివేకా కుమార్తె సునీత తన పిటిషన్లో అనేక సందేహాలు వెలిబుచ్చారని, ఇప్పుడు జగన్‌ నిర్ణయంతో ఆమె అనుమానాలన్నీ నిజమేనని తేలిందని వర్ల పేర్కొన్నారు. తన పిటిషన్‌ను జగన్‌ ఎందుకు వెనక్కుతీసుకున్నాడో, అందుకుగల కారణాలేమిటో రాష్ట్ర ప్రజలకు వివరించాలన్నారు. తన పిషన్‌తో పాటు, సునీత, సౌభాగ్యమ్మలు వేసిన పిటిషన్లు వెనక్కు తీసుకునేలా జగన్‌ వారిపైకూడా ఒత్తిడిచేస్తాడని టిడీపీనేత తెలిపారు. 

read more  వైసిపి జగన్ సొంతం కాదు కబ్జా... పార్టీ అతడిదే..: టిడిపి ఎమ్మెల్సీ సంచలనం

వారికి ఎవరు రక్షణకల్పిస్తారని... వారి భద్రత గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని, సునీతకు, సౌభాగ్యమ్యకు తక్షణమే భద్రత  కల్పించాలని రామయ్య డిమాండ్‌ చేశారు. సునీత వేసిన పిటిషన్లో ఆమె  కేసులో అమాయకుల్ని ఇరికించాలని చూస్తున్నట్లు చెప్పారని... తాజాగా జగన్‌ తీసుకున్న నిర్ణయం అందుకు మరింత ఊతమిస్తోందన్నారు. 

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వివేకాహత్యలో చంద్రబాబు  పాత్ర ఉందన్న జగన్‌, ఇప్పుడు తనపాత్ర  ఉందన్న భయంతోనే పిషన్‌ను వెనక్కు తీసుకున్నాడా అని వర్ల ప్రశ్నించారు. జగన్‌ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలనలేదనే విషయం మరోసారి రుజువైందని, అసలు దోషులెవరో తెలియకూడదనే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడన్నారు. కేసు విచారణ సీబీఐకి అప్పగించాక జగన్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకొనిఉంటే బాగుండేదన్నారు వర్ల రామయ్య. 

  

click me!