మహిళలు స్నానం చేస్తుండగా పోలీసుల డ్రోన్ కెమెరాలు... డీఎస్పీ వివరణ

By Arun Kumar PFirst Published Feb 21, 2020, 2:57 PM IST
Highlights

మందడంలో డ్రోన్ కెమెరాలు వాడుతూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేయడంపై తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. 

గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో నిన్న(గురువారం) చోటుచేసుకున్న ఘటనలపై డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. గతంలో క్రిష్ణాయపాలెం ఘటనపై నమోదైన కేసులు ఎత్తివేయ్యాలని మందడం రైతులు రోడ్డుపై బైటాయించారని...కీలకమైన సచివాలయానికి వెళ్లే దారిని బ్లాక్ చేసి వాహనాలను అడ్డుకోవడం వలనే తాము చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

హైసెక్యూరిటీ జోన్ కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించే డ్రోన్లను వాడామన్నారు. తాను డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని ఆదేశాలు ఇచ్చానని... ఇందులో కానిస్టేబుల్ తప్పేమీ లేదన్నారు. 

అయితే ఈ డ్రోన్ కెమెరాల కారణంగా అక్కడ అలజడి పరిస్థితి ఏర్పడటంతో వాటిని ఆపమని కూడా తానే చెప్పానని అన్నారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగే సమయంలో మాత్రమే ఈ డ్రోన్ వాడుతామన్నారు. మందడంలో రైతులను లీడ్ చేస్తున్న జేఏసీ సభ్యుడు పువ్వాడ సుధాకర్ ఈ అలజడికి కారణమని... అతడిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. 

read more  వివాహ వ్యవస్థకే జగన్ దంపతులు కలంకం... శివరాత్రి రోజే...: అనిత వ్యాఖ్యలు

మహిళలు స్నానాలు చేసేటప్పుడు డ్రోన్ ద్వారా వీడియోలు తీసారనేది అవాస్తవమన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని  తెలిపారు.  శాంతియుతంగా  చేపట్టే నిరసనలకు తాము అడ్డు చెప్పమని... అయితే శాంతిభద్రతల విఘాతం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమన్నారు. 
.చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదని హెచ్చరించారు.

తాను రైతులను భూటు కాలితో తన్నినట్లు కూడా కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయని... ఎవరినీ తాను తన్నలేదన్నారు. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ ని కూడా కులం పేరుతో ఎవరూ దూషించలేదని... ఇదంతా కేవలం కల్పితం మాత్రమేనని అన్నారు. కులం పేరుతో దూషించడం లాంటివి పోలీస్ అధికారులు చెయ్యరని వెల్లడించారు. నిన్న మందడం రాకపోకలకు అంతరాయం కలిగించిన వారిపై కేసు నమోదు చేసామని డీఎస్పీ తెలిపారు.

read more  పాదయాత్రలో ముద్దులు... పరిపాలనలో గుద్దులు ...: జగన్ పై మాజీ మంత్రి సెటైర్లు

ప్రయివేట్ వ్యక్తుల ద్వారా డ్రోన్ కెమెరాలు వాడారని తుళ్ళూరు డిఎస్పీ,సిఐ పై మందడం మహిళలు ఫిర్యాదు  చేశారు. దీంతో డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ శరత్ బాబు  పై తుళ్ళూరు పిఎస్ లో కేసు నమోదయ్యాయి. అలాగే ఎమ్యెల్యే రోజాని అడ్డుకున్న ఘటనపై కూడా కేసు నమోదు చేసినట్లు తుళ్ళూరు పోలీసులు తెలిపారు. 


 

click me!