జగన్ ఓ హిట్లర్... రివర్స్‌ పాలనలో అన్నిరంగాల్లో తిరోగమనమే... : యనమల

By Arun Kumar PFirst Published Oct 24, 2019, 5:55 PM IST
Highlights

ఏపి సీఎం జగన్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ద్వజమెత్తారు. పాలనా అనుభవం లేకే జగన్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని యనమల విమర్శించారు. 

గుంటూరు: రాష్ట్రం అధోగతి పాలుకావడానికి, అభివృద్ధి కుంటుపడటానికి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఏ రంగంచూసినా కూడా రివర్స్‌పాలనే నడుస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా తిరోగమనమే తప్ప ఎక్కడా పురోగమనంలేదని ఆయన ఎద్దేవా చేశారు.

గురువారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ బీటీనాయుడు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలుగుదేశం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటున్న మంత్రులు వాస్తవాలు తెలుసుకోవాలని యనమల హితవు పలికారు. 

2014-15లో రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎలా ఉందో, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అవరోధాలు దాటుకుంటూ, ఎలా అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు నడిపిందో వైసీపీ నేతలు రాష్ట్రప్రజల్ని అడిగి తెలుసుకోవచ్చన్నారు. కష్టాలను అధిగమిస్తూనే, ప్రజలపై పన్నులు వేయకుండానే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 

read more అతిత్వరలో... కడప ప్రాజెక్టులపైనా రివర్స్ టెండరింగ్...: మంత్రి సురేష్

2014-15లో ఆంధ్రాకు, తెలంగాణకు మధ్య రెవెన్యూ వ్యత్యాసం 8శాతముంటే, తెలుగుదేశం దిగిపోయేనాటికి దాన్ని 1శాతానికి తగ్గించడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి  రూ.16వేల కోట్ల పైచిలుకు రెవెన్యూలోటుంటే 14వ ఆర్థికసంఘం తననివేదికలో భవిష్యత్‌లో రూ.22వేల కోట్లవరకు రెవెన్యూలోటు ఉండొచ్చని అంచనా వేసిందన విషయాన్ని గుర్తుచేశారు. అదికూడా తెలియకుండా రాష్ట్రమంత్రి రూ.22వేలకోట్ల రెవెన్యూలోటని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

లోటుబడ్టెట్‌లో ఉండికూడా ఆర్థికరంగాన్ని గాడినపెట్టి, టీడీపీపాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధిని నమోదుచేయడం జరిగిందని యనమల తెలిపారు. కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల్లో రాష్ట్రానికి ఆదాయంలేదని వైసీపీమంత్రులే ఒప్పుకున్నారని, ఆదాయం లేకపోవడానికి వారే కారణమని మాజీమంత్రి తేల్చిచెప్పారు. 

ప్రధానికి, అమిత్‌షాకు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వేర్వేరు నివేదికలను బయటపెడితే ప్రభుత్వ నిర్ణయాల్లోని డొల్లతనం ఏమిటో బహిర్గతమవుతుందన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేదు, పరిశ్రమలు లేవు, ప్రత్యేకహోదా ఇస్తేతప్ప రాష్ట్రాన్ని నడపలేమని వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. 78శాతం నుంచి 68శాతం వరకు వృద్ధి పడిపోయిందని, రాష్ట్రప్రభుత్వమే అంగీకరించిందన్నారు. 2014-15లో టీడీపీ పాలనలో ఆర్థికాభివృద్ధిరేటు 9శాతముంటే తాము దిగిపోయేనాటికి నాలుగేళ్లలో సరాసరిన దాన్ని 11.02శాతానికి చేర్చామన్నారు. 

అదేవిధంగా టీడీపీ వచ్చేనాటికి తలసరి ఆదాయం రూ.93వేలుంటే దిగిపోయేనాటికి రూ.లక్షా64వేల రూపాయలకు దాన్ని పెంచామన్నారు. వైసీపీప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదికలో గతేడాదికి, ఈ ఏడాదికి తలసరిఆదాయం రూ.17వేలకు పైగా తగ్గిందన్నారు. టీడీపీ హయాంలో నాలుగేళ్లలో తలసరి ఆదాయం ఎప్పుడూ తగ్గలేదని,   ఒకమనిషి ఆదాయం రూ.17వేలుతగ్గడానికి, రాష్ట్రరెవెన్యూ ఆదాయం తగ్గడానికి, ఆర్థికా భివృద్ధిరేటు 8శాతం తగ్గడానికి   వైసీపీ ప్రభుత్వం కారణం కాదా అని రామకృష్ణుడు ప్రశ్నించారు. 

తెలుగుదేశమే కష్టాలు తెచ్చిపెట్టిందని, కేంద్రం ఆదుకోకుంటే, రాష్ట్రాన్ని నడిపించలేమని వైసీపీ ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ ప్రజల్ని మోసగించడమేనన్నారు.   ఆదాయం, అభివృద్ధిరేటుని పెంచేలా, పోలవరం, అమరావతి సహా ఇతర నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగించినందునే తెలుగుదేశం పాలనలో వృద్ధిరేటు, తలసరి ఆదాయం పెరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కొరత కారణంతో నిర్మాణాలు నిలిచిపోయి, పేదలు, సామాన్యులకు పనిలేకుండా పోవడంతో ప్రజల్లో కొనుగోలుశక్తి తగ్గిపోయి, తలసరిఆదాయం, వృద్ధిరేటు తగ్గిందన్నారు. 

read more దమ్ముంటే ఆపుకో...పవన్ కల్యాణ్ కు అంబటి సవాల్

పనిలేకుండా ఆదాయం ఎక్కడినుంచి వస్తుందో, కొనుగోలు శక్తి తగ్గడానికి వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేకారణమన్నారు.  ఇలా ఆదాయ,వ్యయాలకు ఖర్చులకు మధ్య ఒకసారూప్యత ఉంటుందనే కనీస ఆలోచన కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. పేదవాడు బాగుపడకుండా, వారికి ఏవిధమైన సౌకర్యాలు లేకుండా చేస్తే, రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుందని యనమల ప్రశ్నించారు. 

జగన్‌, అమిత్‌షాకు ఇచ్చిన నివేదికలో సర్వీసెస్‌, ఇండస్ట్రీస్‌ పడిపోయాయని చెప్పారని, అర్బనైజేషన్‌ లేకుండా సేవారంగం ఎలా వృద్ధిలోకొస్తుందన్నా రు. గృహనిర్మాణం సహా, మౌలిక వసతుల కల్పన వంటివన్నీ వైసీపీ పాలనలో పడకేశాయ ని, ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 

గ్రామవాలంటీర్‌, సచివాలయ ఉద్యోగాలు చేయడానికి ఎవరూ ముందకురావడం లేదని,  వారి నియామకం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుందో భవిష్యత్‌లో తెలుస్తుందని యనమల ఎద్దేవాచేశారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై జగన్‌కు అవగాహనలేదని,  అందుకు ఆయన పరిశ్రమలు, వృద్ధిరేటు, ఆదాయవ్యయాలు ఆయనకు పట్టవన్నారు. 

గతప్రభుత్వంలో రాష్ట్రం ఈజ్‌ఆఫ్‌డూయింగ్‌లో రెండుసార్లు తొలిస్థానంలో నిలిచిందని, వరల్డ్‌బ్యాంకే ఆ స్థానాన్ని కట్టబెట్టిందన్నారు. ఎకానమీ గురించి జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోడని, అది తెలియకపోవడం వల్లే రాష్ట్రంలో ఎకనామిక్‌ యాక్టివిటీస్‌ లేకుండా పోయాయని మాజీమంత్రి స్పష్టంచేశారు. 

రాష్ట్రంలో ప్రజలకు లభించని ఇసుక, పక్కరాష్ట్రాల్లో మాత్రం లారీ రూ.లక్షవరకు అమ్ముడవుతోందన్నారు. ఈ విధమైన దోపిడీకి ఎవరు కారణమో వైసీపీ మంత్రులకు తెలియదా అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో రోడ్లు, డ్రైన్లు, ఇతరేతర అభివృద్ధిపనులతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని కూడా తెలుగుదేశం కొనసాగించిం దని, కేంద్రమిచ్చే నిధులకు తోడు అదనంగా ఖర్చు చేసిందన్నారు. 

 కేసీఆర్‌ తనకు లబ్దిచేకూర్చాడని, గోదావరి జలాలను తెలంగాణకు అప్పగించడానికి  జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. అమరావతిపై ప్రభుత్వమేసిన పీటర్‌కమిటీని ముందుపెట్టి, జగన్మోహన్‌రెడ్డి తాననుకున్నదే నివేదికలో పొందుపరుస్తాడన్నారు.  జగన్‌ హిట్లర్‌ తీరుగా ప్రవర్తిస్తుంటే, ఆయన సాక్షిమీడియా 'డియాగ్రిఫ్‌'  మాదిరిగా వ్యవ హరిస్తోందని, జగన్‌పాలనపై సొంతంగా సుత్తికొట్టుకుంటోందని యనమల దుయ్యబట్టారు.  

click me!