కృష్ణా, గోదావరి నదుల పరిరక్షణ...జగన్ సర్కారు మరో ముందడుగు

By Arun Kumar PFirst Published Oct 23, 2019, 8:23 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాలకు వరప్రధాయినులుగా నిలిచిన గోదావరి, కృష్ణా నదులు పరిరక్షణకు ఏపి సర్కార్ సిద్దమయ్యింది. ఈ  మేరకు ఈ నదుల పరిరక్షణపైనే ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అమరావతి :  కాలుష్యకాసారాలుగా మారుతున్న కృష్ణా, గోదావరి కాలువల ప్రక్షాళనకు ఏపి ప్రభుత్వం సమాయాత్తమైంది. పాదయాత్రలో భాగంగా ఈ నదుల పరిస్థితిని కళ్ళారా చూసిన ముఖ్యమంత్రి జగన్ వాటి సుందరీకరణకు చర్యలు ప్రారంభించారు. 

కృష్ణా, గోదావరి కాల్వల్లో రోజు, రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. సుదీర్ఘ పాదయాత్రలో కాలుష్యం కారణంగా గోదావరి, కృష్ణా కాలువల్లో నీరు కలుషితమవుతున్న తీరును స్వయంగా చూసిన ముఖ్యమంత్రి నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టారు. 

భూగర్భ జలాలు సైతం రోజు, రోజుకూ తీవ్రంగా కలుషితం కావడంతో పాటు వాటి దుష్పలితాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని... దీన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. కాలుష్య నియంత్రణ కోసం పనిచేస్తున్న వివిధ సంస్ధలతో కలిసి నివారణ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతనే కాల్వల్లోకి విడిచి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గోదావరి, కృష్ణా కాల్వలలో బాగు చేయాల్సిన ప్రాంతాలు గుర్తించాలన్నారు. ఎక్కడెక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలో కూడా గుర్తించాలన్నారు. 

కాల్వల సుందరీకరణ, చెట్ల పెంపకంపై కార్యచరణ రూపొందించాలన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన గోదావరి, కృష్ణా కెనాల్స్‌ మిషన్‌ బాధ్యతలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఈ మిషన్ ఛైర్మన్ గా సీఎం శ్రీ జగన్, వైస్ ఛైర్మన్ గా గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ (జీడబ్ల్యూఎస్) నుంచి రాజశ్రీ వ్యవహరించనున్నారు. 

సమీక్షా సమావేశంలో కాలుష్య నివారణ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసిన గండిపేట వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను సీఎం అధికారులకు పరిచయం చేశారు. అనంతరం జీడబ్ల్యూఎస్‌ ప్రతినిధులు కేరళలోని కన్నూర్‌లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను వీడియో ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులకు వివరించారు.  అదే తరహాలో కృష్ణా, గోదావరి కాల్వల శుద్ధి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చెప్పారు. 

 నదుల పరిరక్షణ; సుందరీకరణ విషయాల్లో ఈ సంస్ద సహాయం తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలోని నాలుగు కిలోమీటర్ల కృష్టా నది కాల్వను అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

click me!