ప్రజలంటే జగన్ కు ఎంత ప్రేమంటే...ఈ ఒక్కటి చాలు: ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా

By Arun Kumar PFirst Published Oct 10, 2019, 6:45 PM IST
Highlights

గుంటూరు పట్టణంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్  ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా  ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికెత్తేశారు.  

గుంటూరు: ప్రపంచ కంటి చూపు (దృష్టి) దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపి ప్రభుత్వం వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి గురవారం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా గుంటూరు నగర పరిధిలోని కొత్తపేట జలగం రామారావు మెమోరియల్ కార్పోరేషన్ హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ.యస్.రామకృష్ణలు హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమానికి ఎమ్మెల్యే  అధ్యక్షత వహించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.  ఇందు కోసం ప్రభుత్వం రూ.560 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.  మొత్తం 6 దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదుకు ప్రణాళికలను తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు.  

నేటి(గురువారం) నుంచి ఈ నెల 16 వరకు గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలతో పాటు ఐ.సి.డి.యస్, వైద్య ఆరోగ్య శాఖ, ప్రైవేటు కంటి వైద్యశాలల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు  విధుల్లో పాల్గొంటారని అన్నారు. 

ప్రస్తుత సమాజంలో విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కలెక్టర్ పిలునిచ్చారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసారు.  

 గుంటూరు తూర్పు ఎమ్మెల్యే  మహ్మద్ ముస్తపా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ విడుదల చేసిన కరపత్రంలోని అంశాలను అందరికి చదివి వినిపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి ప్రభుత్వ పథకాలను వెలుగులోకి తీసుకురాలేదని అన్నారు. జగన్ స్పూర్తి అందరిలో రావాలని పిలుపునిచ్చారు. 

 తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేసారు.  భవిష్యత్తు తరాలకు వైయస్ఆర్ కంటి వెలుగు పథకం మార్గ దర్శకం అవుతుందన్నారు.  పేదల అభ్యున్నతి పట్ల ముఖ్యమంత్రికి వున్న అభిమానానికి ప్రజలంతా  బుణపడి  వుంటారని  కొనియాడారు.   రాబోయే కాలంలో విద్యార్దులు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపాధ్యాయులు సహకారం అందించాలని శాసన సభ్యులు  పిలుపునిచ్చారు. 
 
 ప్రపంచ దృష్టి దినోత్సవం రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు రామకృష్ణ కొనియాడారు. విద్యార్దులు, ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు ఇటువంటి ప్రభుత్వ పధకాలను సద్వినియోగ పరచుకోవాలని కోరారు.  సమాజంలోని ప్రతి ఒక్కరికి ఏదో ఒక కంటి సమస్య ఉందని అన్నారు.  గతంలో ఎటువంటి కంటి సమస్య వచ్చిన పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు పరిష్కారం అమలు చేయలేకపోయామని అన్నారు.

గుంటూరు నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా అనురాధ మాట్లాడుతూ... విద్యార్దుల్లో ఉన్న దృష్టి లోపాలను సరి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించ తగినదని అన్నారు.  గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రభుత్వం మరియు ప్రవైట్ పాఠశాలల పిల్లలు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  

 గుంటూరు జిలా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారిణి డా.జె. యస్మిన్  పథకం వివరాలు, అమలు విధానాలను వివరించారు.  మొత్తం 6 దశల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాలను పూర్తి  స్థాయిలో అమలు చేస్తామన్నారు.  ఈ నెల 16 వ తేది నాటికి అన్ని పాఠశాలల్లోని విద్యార్దులకు కంటి సమస్యలను గుర్తించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.  ప్రస్తుత ముఖ్యమంత్రివర్యులకు  ఇటువంటి మంచి ఆలోచన రావడం సంతోషకరమైన విషయమన్నారు. 

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫాతో కలసి విద్యార్దుల కంటి పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు.  అనంతరం విద్యార్దుల్లో కంటి సమస్యలు గుర్తించే విధానాన్ని స్వయంగా పరిశీలించి,  పనితీరును అడిగి తెలుసుకొని, విద్యార్దులకు నమోదు కార్డులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారిణి ఆర్.ఎస్.ఎస్. గంగా భవాని, స్థానిక వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టి నాయకులు పాదర్తి రమేష్ గాంధీ, షేక్  షౌకత్, వార్డు నాయకులు మాట్లాడారు.   

ఈ కార్యక్రమంలో ఆ యా ప్రభుత్వ శాఖల జిల్లా, నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక ప్రభుత్వ పాఠశాలల  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్దిని, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు. 

click me!