అమరావతిలో సకలజనుల సమ్మె సందర్భంగా మందడం మహిళలపై పోలీసులు దాడి చేయడాన్ని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ ఖండించారు. ఈ ఘటనపై ఆయన మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతిలో ప్రజలు తమకు అన్యాయం జరిగుతోందని నిరసన చేపడితే వైసిపి ప్రభుత్వం పట్టించుకోకపోగా పోలీసుల చేత వారిపై దాడులు చేయిస్తోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సకల జనుల సమ్మెల్లో భాగంగా నిరసన తెలియజేస్తున్న మందడం గ్రామానికి చెందిన మహిళలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటూ... పరుష దూషణలతో పాటు బౌతిక దాడులకు కూడా పాల్పడ్డారని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.
మహిళ నిరసనకారులపై పోలీసుల దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్ కి పిర్యాదు చేశారు. శాంతియుతంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించారని... మహిళలపై, రైతులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు.
read more బట్టలు చించేసి, ఒంటిపై గాట్లు పడేలా: పోలీసులపై మందడం మహిళల ఫిర్యాదు
మహిళలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ని కోరినట్లు కనకమేడల తెలిపారు. అయితే ఈ దాడిపై రిపోర్ట్ అడుగుతామని, ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని మానవ హక్కుల కమిషన్ సభ్యులుహామీ ఇచ్చినట్లు తెలిపారు. రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు బాగుపడ్డ చరిత్రలో లేదని కనకమేడల విమర్శించారు.
బోస్టన్ కమిటీ నివేదికకు విలువే లేదని... ప్రభుత్వానికి నచ్చినట్లు రాసుకొని కమిటీ సభ్యులతో సంతకాలు పెట్టించుకుంటున్నారన్నారు. తాము శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగానే రాజధాని ప్రాంతాన్ని ఎంచుకున్నామని... ఆ తర్వాత ఎన్ని కమిటీలు వేసిన వాటికి చట్టబద్దత ఉండదన్నారు. జాతీయ మహిళ కమిషన్ ని కలిసి అమరావతిలో మహిళలపై పోలీసులు జరిపి దాడి పై ఫిర్యాదు చేస్తామని కనకమేడల తెలిపారు.
read more అమరావతిలో జగన్ నివసిస్తున్న ఇల్లు ఎవరిదంటే: వర్ల రామయ్య సంచలనం
సకలజనుల సమ్మె సందర్బంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మందడంలో నిరసనకు దిగిన మహిళలపై పోలీసుల వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.
మందడం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి భూములిచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవాళ్లపై పోలీసులు జులుం ప్రదర్శించడంపై చంద్రబాబు మండిపడ్డారు.
రైతులపైకి పోలీసు వాహనాలను నడిపి గాయాలపాలు చేయడం అప్రజాస్వామికమని ఆరోపించారు. వేలాది పోలీసులను గ్రామాల్లో దించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని... తమ భూముల్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం త్యాగం చేసిన వాళ్ళను ఇంత దారుణంగా హింసిస్తారా ..? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంట్లోంచి బయటకు రావడానికి భయడే మహిళలను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తరలించడం అమానుషమన్నారు. రైతులపై, మహిళలపై అక్రమ కేసులను తక్షణం ఎత్తేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని... రైతులు, మహిళల్లో నెలకొన్న ఆందోళనలు తొలగించే చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.