వైసిపిలో అసమ్మతి సెగలు... మహాఅయితే మరో మూడేళ్లు మాత్రమే...: బుచ్చయ్య చౌదరి

By Arun Kumar PFirst Published Feb 10, 2020, 7:42 PM IST
Highlights

రాజధాని కోసం అమరావతి మహిళలు చేపట్టిన ధీక్షకు టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.

గుంటూరు: ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటున్నాడని... అలాగయితే  రాజధానికొకరు చొప్పున ముగ్గురు ముఖ్యమంత్రులు, ముగ్గురు  గవర్నర్ లు వుండాలని టిడిపి ఎమ్మెల్యే కరణం బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఇలా చేయడం సాధ్యం కాదు కాబట్టి మూడు రాజధానుల వల్ల అభివృద్ది కూడా సాధ్యం కాదన్నారు. 

ఆయన సోమవారం రాజధాని కోసం దాదాపు రెండు నెలలుగా పోరాటం చేస్తున్న అమరావతి మహిళల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  రాజమహేంద్రవరం నుంచి సంఘీభావం తెలపడానికే ఇక్కడికి వచ్చామన్నారు. అమరావతి రాజధాని కేంద్రంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్న విషయం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు ఎలా చెబితే అర్థమవుతుందో తెలియడం లేదన్నారు. 

''రాజధాని రైతులు మహిళలు ఆందోళన చెందవద్దు ధైర్యంగా ఉండండి.  వైసీపీలో కూడా అసమ్మతి సెగతో ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ ఇప్పుడు కొత్తగా స్కూల్ పెట్టాడు ఆ స్కూలు బూతుల స్కూలు. కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. నెల్లూరులో అనిల్ ఏమంటాడో తెలియదు. ఈ బాధల నుండి బయటపడాలంటే మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి'' బుచ్చయ్య చౌదరి సూచించారు.

పెట్టుబడులు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని.... వాటితో వెనుకబడి జిల్లాలను అభివృద్ది చేసుకునే ఆస్కారం వుంటుందన్నారు. అమరావతి కేంద్ర స్థానం 13 జిల్లాలకు నడిబొడ్డున ఉందని అన్నారు. ఇక్కడ నీటి వసతి కూడా పుష్కలంగా వుందన్నారు.   

వైజాగ్  ఇప్పటికే అన్నిట్లో అభివృద్ధి చెంది ఉందని... కేవలం ఈ ఒక్క జిల్లా ఆదాయమే  2 లక్షల 87 కోట్లు వస్తున్నాయని తెలిపారు. భారతదేశంలోనే ఆదాయం అధికంగా వచ్చే జిల్లాల్లో వైజాగ్ ఒకటని బుచ్చయ్య చౌదరి తెలిపారు. 

read more   ఈ ఒక్కసారే ఇక్కడ...వచ్చే ఏడాది వైజాగ్ లోనే..: మంత్రి అనిల్

''అమరావతి రైతులు గతంలో రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూమి ఇచ్చారు.  ఒక వంతు తమవద్దే వుంచుకుని మూడు వంతులు ప్రభుత్వానికి ఇచ్చారు. దానిలో 9 వేల ఎకరాలు అమ్మితే లక్ష కోట్లు ఆదాయం వస్తుంది. ఒక 50 వేల కోట్లు పోగా ఒక 50 వేల కోట్లు రాజధాని నిర్మాణం చేయొచ్చని సంకల్పం చంద్రబాబుది'' అని వివరించారు.

''న్యాయ పోరాటానికి రైతులు అందరూ సిద్ధంగా ఉండండి. ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల కంటే ఉండదు. రాజమండ్రి  జైలుకి రంగులు వేస్తున్నారు. జగన్ కోసమే సిద్ధం చేస్తున్నట్లుగా వున్నారు'' అంటూ ఎద్దేవా చేశారు.

''ఒకే కులం కులం అంటున్నారు. రాజధాని తాడికొండ నియోజకవర్గం దళితులకు రిజర్వేషన్ ఉంది. ఎమ్మెల్యే దళితులు. ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది 80% దళితులు బలహీన వర్గాలే వున్నారు. అన్ని కులాలు వారు భూమిని ఇచ్చారు. 29 వేల మంది రైతులు భూములు ఇచ్చారు. వారిలో 25 వేల మంది ఒక ఎకరా రెండు ఎకరాల భూమి ఉన్న సన్న చిన్న కారు రైతులు. ఇవాల అలాంటి రైతుల మీద పిడుగు పడ్డట్టు ఉంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

read more  మంత్రులను చెప్పులతో కొట్టడం ఖాయం...: బోండా ఉమ

''గత టిడిపి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్,  ఎస్సీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ అంటూ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అలాంటివేవీ కనపడటంలేదు. కేంద్రం రెండు వేల కోట్లు ఇస్తే ఏం చేశారు'' అని బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. 


 

click me!