ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం... డిసెంబరు నుండే పైలట్‌ ప్రాజెక్టు అమలు

By Arun Kumar PFirst Published Oct 23, 2019, 5:52 PM IST
Highlights

ఏపిలో అమలవుతున్న మద్యాహ్న భోజన పథకంలో భారీ మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ మేరకు విద్యార్థులకు అందించే ఆహారంలో మార్పులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించాారు. 

 అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారంపై  ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టిపెట్టాలని ఆయన అధికారులకు సూచించారు.క్షేత్రస్థాయిలోకి వెళ్లి పిల్లలు ఏం తింటున్నారో తెలుసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ముందుగా చిన్నారులకు అందుతున్న ఆహారపదార్థాలు, పోషకాల గురించి తెలుసుకుని ఆతర్వాత ఎలాంటి మార్పులు చేయాలన్నదానిపై సూచనలు చేయాలన్నారు. పిల్లలకు మంచి మెనూతో భోజనం పెట్టాలని..దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. చిన్నారుల ఆహారంలో పోషక విలువలు యాడ్‌ చేయడంకోసం నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా రాష్ట్రం అడుగులు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు . రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రక్తహీనత, పౌష్టికాహారలోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లోని గర్భవతులు, 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్నిపెంచుతూ పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల్లో డిసెంబరు నుండి పైలట్‌ ప్రాజెక్టు అమలు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గర్భవతులకు, బాలింతలకు నెలకు రూ.1062ల విలువైన ఆహారం  25 రోజలుపాటు అందించనున్నట్లు ప్రకటించారు. 

ఇందులో భాగంగా రోజూ భోజనం, గుడ్డు, 200మి.లీ. పాలు, రూ. 500 విలువ చేసే వైఎస్సార్‌ బాల సంజీవని కిట్‌ (మొదటివారం రెండు కేజీల మల్టీ గ్రెయిన్‌ ఆటా, రెండోవారం అరకేజీ వేరుశెనగలతో చేసిన చిక్కీ, మూడోవారం అరకేజీ రాగి ఫ్లేవర్‌ మరియు అరకేజీ బెల్లం, నాలుగోవారం అరకేజీ నువ్వులుండలు) అందివ్వనున్నారు.

అలాగే ఇవే  77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల్లోని 6నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు నెలలో ప్రతిరోజూ గుడ్డు, 200 మి.లీ. పాలు, వైఎస్సార్‌ బాలామృతం కిట్టు కింద రోజుకు రూ.100 గ్రా. ల చొప్పున 2.5 కేజీలు మొత్తంగా నెలకు రూ.600 విలువ చేసే పౌష్టికాహారం అందించనున్నారు. పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజలపాటు ఈ పౌష్టికాహారం అందించనున్నట్లు  తెలిపారు. 

నెలలో 25 రోజులపాటు భోజనం, గుడ్డు, 200 మి.లీ. పాలు, పోషకాలు ఇచ్చే అల్పాహార పథకాన్ని కూడా ప్రభుత్వం రూపొందించింది. ఈప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 7, విశాఖపట్నం 11, తూర్పుగోదావరి 11, పశ్చిమగోదావరి జిల్లాలో 6 గిరిజన మండలాల్లో(మొత్తం 36 మండలాలు)అమలు చేయనున్నారు.

సబ్‌ప్లాన్‌ ఏరియాకు సంబంధించి శ్రీకాకుళం 19, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 3, ప్రకాశం 3, కర్నూలు 3, గుంటూరు జిల్లా నుంచి 3 మండలాలు కలిపి మొత్తం 41 మండలాలను ఎంపిక చేశారు. 
  

click me!