''దళితులంటే టిడిపి ఎప్పుడూ చులకనే...ఇదే నిదర్శనం...''

By Arun Kumar PFirst Published Oct 22, 2019, 8:51 PM IST
Highlights

దళిత ఉద్యోగిని అవమానించిన ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ విసిని టిడిపి నాయకులు వెనకేసుకు రావడాన్ని వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున తప్పుబట్టారు. ఈ విషయంపై వారు గవర్నర్ ను కలవడం విడ్డూరంగా వుందన్నారు.   

తాడేపల్లి: ఓ దళిత ఉద్యోగిని కులం పేరుతో దూషించి అవమానించిన అధికారిని టిడిపి నాయకులు వెనకేసుకు  వస్తున్నారని వేమూరు ఎంఎల్ఏ మేరుగు నాగార్జున ఆరోపించారు. దళితులకు ఎలాంటి కష్టమొచ్చినా తామే అండగా వుంటామని చెప్పుకునే పార్టీలు ఇలా ఓ దళిత ఉద్యోగి ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా ఉన్నతాధికారికి అండగా నిలవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.  

 కాంట్రాక్ట్  ఉద్యోగి మురళికృష్ణను వ్యవసాయ యూనివర్శిటి విసి దామోదర్ నాయుడు అవమానించిన మాట వాస్తమేన్నారు.  ఉద్యోగం నుంచి తీసేశారని తిరిగి పెట్టుకోమని అడగడానికి సచివాలయానికి వస్తే అక్కడే వున్న విసి అవహేళన చేశాడని తెలిపారు. ఇలా కులంపేరుతో తనను దూషించిన వ్యక్తిపై సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద విసి అరెస్ట్ చేశారన్నారు. 

వైస్ ఛాన్సలర్ దామోదర్ నాయుడుపై కేసులు పెడితే మీరు గవర్నర్ దగ్గరకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ  విషయంలో ఎంపీ కేశినేని నాని సారథ్యంలో టీడీపీ నాయకులు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా వుందన్నారు.

 దళితుల హక్కులను కాలరాస్తూ గతంలో చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకే , టీడీపీ నేతలు గవర్నర్ ను కలిశారని ఆరోపించారు. తమరి సామాజిక వర్గానికి చెందిన వైస్ ఛాన్సలర్ దళితుడిని తిడితే జగన్మోహన్ రెడ్డి పాలన బాగోలేదని  గవర్నర్ కు పిర్యాదు చేస్తారా..? అని ప్రశ్నించారు.

ఉద్యోగంలో చేర్చుకోమని మురళీ అడిగితే దామోదర్ నాయుడు కులంపేరుతో దూషించి నీ అంతు చూస్తానని బెదిరించడమే కాదు... దళితులను తన ఛాంబర్ చుట్టుపక్కలకు రావద్దని చెప్పిన దామోదర్ నాయుడును వెనకేసుకు రావడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా...? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున యూనివర్శిటి లో రిషితేశ్వరి అనే బీసీ విద్యార్థిని ర్యాగింగ్ కు బలైతే బాధ్యుడైన బాబూరావు(ప్రిన్సిపాల్)  వీరే వెనుకేసుకువచ్చారు. రోహిత్ వేముల అనే సెంట్రల్ యూనివర్శిటి విద్యార్థి అప్పారావు అనే వీసీ వలన మరణిస్తే ఆయనను వెనకేసుకొచ్చారు. దళితులంటే టీడీపీ నాయకులకు ముందునుంచే చిన్న చూపు వుందని అన్నారు.

దళితులు,బిసిలు టీడీపీ నాయకులకు అవసరం లేదా.... అని ప్రశ్నించారు.   కేవలం తమరి సామాజిక వర్గం కోసం టిడిపి నాయకులు దళితులనుఏమైనా చేస్తారని పేర్కొన్నారు. 
కోట్లు దండుకోవడం..తన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

 రాజ్యాంగ వ్యవస్దలను తన పాలనలో చంద్రబాబు భ్రష్టుపట్టించారని ఆరోపించారు. టిడిపి అధికారంలో ఉండగా దళితులను దారుణంగా అవమానించారని...ఎంతోమంది దళితుల భూములు లాక్కున్నారన్నారు. దళిత మహిళలను వివస్ర్తలను చేసిన సంఘటనలు కూడా చోటుకున్నాయని ఆరోపించారు.దళితులపై వరుసగా దాడులకు తెగబడుతూ పాలన సాగించారని విమర్శించారు. -టిడిపి పాలనలో దళితులపై జరిగిన అరాచకాలు మీకు కనబడలేదా...? అని ప్రశ్నించారు.

 ఏపిపిఎస్సీ చేపట్టే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూలు లేకుండా చేసిన ఘనత జగన్ దే అని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించారని పేర్కొన్నారు. ఈరోజు అన్ని వర్గాల వారు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారని వెల్లడించారు.

ఇది చూసి ఓర్వలేకే చంద్రబాబు సీఎం వైయస్ జగన్ పరిపాలనపై కుయుక్తులతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు జగన్ వెనుకే ఉన్నారన్న ఉద్దేశ్యంతో వారిపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని ఎమ్మెల్యే నాగార్జున ఆరోపించారు. 
 

click me!