అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త...ఎన్నికల హామీల అమల్లో జగన్ మరో ముందడుగు

By Arun Kumar PFirst Published Oct 19, 2019, 4:26 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే అధికారాన్ని హస్తగతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలను ఒక్కోటిగా నెరవేర్చడం ప్రారంభించారు. ఇందులోభాగంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 

అమరావతి: ఎన్నికల హామీల అమల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంలో వైఎస్సార్‌సిపి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.20వేలలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ ప్రభుత్వం తరఫున డబ్బులు చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకున్నారు. 

అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు సూచనలను అనుసరించి మొదటగా రూ.10వేలలోపు డిపాజిట్‌ చేసిన ఖాతాదారులకు ప్రభుత్వం చెల్లింపులు జరపనుంది. దీనికోసం రూ. రూ.269.99 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. కోర్టు ఆదేశించినట్టుగా జిల్లా లీగల్‌సెల్‌ల ద్వారా ఈ డబ్బును బాధితులకు అందించనున్నారు. 

వైఎస్ జగన్ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే రాపాక క్షీరాభిషేకం...

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చర్యలు చేపట్టింది. బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రూ.1150 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలోంచి తాజాగా రూ.269.99 కోట్లు మంజూరు చేశారు. 

ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిటర్ల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. గుంటూరు జిల్లాలో 19,751 బాధితులకు రూ. 14,09,41,615లు, చిత్తూరుకు జిల్లాలో 8,257 మందికి రూ. 5,81,17,100 తూర్పుగోదావరి జిల్లాలో 19,545 మందికి  రూ. 11,46,87,619, పశ్చిమగోదావరి జిల్లాలో 35,496 మందికి రూ. 23,05,98,695, విజయనగరం జిల్లాలో 57,941 మంది బాధితులకు  రూ. 36,97,96,900, శ్రీకాకుళం జిల్లాలో 45,833 మందికి రూ. 1,41,59,741 మంది వున్నారు. 

అలాగే కర్నూలు జిల్లాలో 15,705 మందికి రూ. 11,14,83,494, నెల్లూరు జిల్లాలో 24,390 మందికి రూ. 16,91,74,466, కృష్ణా జిల్లాలో 21,444 మందికి రూ. 15,04,77,760, అనంతపురం జిల్లాలో 23,838 మందికి రూ. 20,64,21,009, వైయస్సార్‌ కడప జిల్లాలో 18,864 మందికి రూ. 13,18,06,875, ప్రకాశం జిల్లాలో 26,586 మందికిరూ. 19,11,50,904,  విశాఖపట్నం జిల్లాలో 52,005 మందికి రూ. 45,10,85,805  రూపాయలను తొలివిడతలో చెల్లించనున్నారు. మొత్తమ్మీద 3,69,655 మందికి రూ.263.99 కోట్లు చెల్లించనున్నారు.

సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి జిల్లాలోను అగ్రిగోల్డ్‌ బాధితులు వైఎస్‌.జగన్‌ను కలుసుకుని తమ ఆవేదను వ్యక్తం చేశారు. కూలిపనులు చేసుకున్నవారు, చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాన్ని నడుపుకుంటున్నవారు, మధ్యతరగతి ప్రజలు చాలామంది డబ్బు ఇప్పించాలని కోరారు. 

దీంతో రూ.20వేలలోపు డిపాజిట్‌ చేసిన బాధితులందరికీ ప్రభుత్వం తరఫునే చెల్లిస్తామని... ఈమేరకు రూ.1150 కోట్లు ఇస్తామని వైఎస్‌.జగన్‌ అగ్రిగోల్డ్‌ బాధితులకు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చారు. ఆ హామీ అమల్లో భాగంగా తొలి అడుగు వేస్తూ తొలి విడతలో రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించనున్నారు.
 

click me!