ఈనాడుకు ప్రభుత్వ యాడ్స్ ఎందుకు ఇస్తున్నామంటే..: బొత్స

By Arun Kumar PFirst Published Oct 18, 2019, 8:58 PM IST
Highlights

మీడియా స్వేచ్చపై చంద్రబాబు నాయుడు మాట్లాడటాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టాడు. ఆయన రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ప్రజలను భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

అమరావతి: తమ పార్టీ నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడటాన్ని తగ్గించుకోవాలని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆయన వివేకా హత్య గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా వుందని బొత్స ఎద్దేవా చేశారు. 

వైఎస్సార్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించలేదన్నారు. తాము ఎలాంటి చట్టం తీసుకురాలేదని అన్నారు. పత్రికా స్వేచ్చ గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు.

గతంలో ప్రభుత్వంపై వక్రభాష్యం రాసే పత్రికలపై పరువు నష్టం దావా వేసేవారని... ఇప్పుడు అదేపని అధికారులు చేస్తున్నారని అన్నారు. ఎవరు ఎలాంటి తప్పుడు వార్తలు రాసినా కళ్ళు మూసుకుని కూర్చోమంటారా..? అని ప్రశ్నించారు.

గతంలో ప్రెస్ మీట్లలో చంద్రబాబు విలేఖరులును బెదిరించారని అన్నారు. వైఎస్సార్‌సిపి కార్యకర్తలను  బహిరంగంగానే బెదిరిస్తూ ఏవిధంగా అవమానించారో మరిచిపోయారా...?  అని అన్నారు. మీరు చేసిన దానితో పోలిస్తే మేము చేసింది చాలా తక్కువని అన్నారు.

మీకంటే చిన్నవయసులోనే జగన్ సీఎం అయ్యారని మీకు బాధగా ఉన్నట్లు అర్థమవుతోందని... ఆ అక్కసుతోనే ఇలా చేస్తున్నారని చంద్రబాబును విమర్శించారు. ఆయన హయాంలో మీడియాపై అనేక కేసులు పెట్టించారని గుర్తుచేశారు.

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మీడియా ప్రతినిధిని సమావేశాలకు రావద్దని చెప్పలేదన్నారు. కానీ గతంలో చంద్రబాబు సాక్షి ప్రతినిధులను రావద్దని బెదిరించలేదా..? అంటూ ప్రశ్నించారు. 

చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరన్నారు.  సాక్షి ,ఈనాడు కు సర్య్కులేషన్ ఎక్కువ ఉంది కాబట్టే రైతు భరోసా యాడ్స్ ను ఇచ్చామన్నారు. మమ్మల్ని ప్రశ్నించే ముందు తమరి ప్రభుత్వ హయాంలో సాక్షికి ప్రభుత్వ యాడ్స్ ఎందుకు ఇవ్వలేదు...? జగన్ బంధువులు మేనేజ్మెంట్ లో ఉన్నారని ఇవ్వలేదా..? అని బొత్స ప్రశ్నించారు. 
 

click me!