అందుకోసమే ఇంగ్లీష్ మీడియం... తెలుగు భాషను విస్మరించడానికి కాదు: అంబటి

By Arun Kumar PFirst Published Dec 28, 2019, 7:01 PM IST
Highlights

తెలుగు భాష మీద అందరికీ మమకారం ఉంటుందని... అది మన తల్లిలాంటి భాష అని అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వం కూడా అలాగే భావిస్తోందని ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదని అన్నారు.  

విజయవాడ: ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభలు జరగటం కొత్త ఏమీ కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. 2007, 2008, 2015లో తెలుగు మహాసభలు జరిగాయని...మళ్లీ ఇప్పుడు 4వ మహాసభలు విజయవాడలో మూడు రోజుల పాటు జరుగుతున్నాయని అంబటి తెలిపారు. దీనికి మంచి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. 

తెలుగు భాష మీద అందరికీ మమకారం ఉంటుందన్నారు. తెలుగు భాష తల్లిలాంటి భాష, మన మాతృభాష. దాన్ని గౌరవించాలని సూచించారు. దాన్ని ప్రేమించి   ఆరాధించాలన్నారు. దీంట్లో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదని అంబటి అన్నారు. 

అయితే నిన్న ప్రపంచం తెలుగు రచయితల సభ జరిగిన తీరు.. కొంతమంది మాట్లాడిన మాటలు పత్రికల్లో చూసినప్పుడు బాధ కలిగించిందన్నారు. ఆ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మమ్మల్ని విమర్శలు చేయటం తగదన్నారు. 

read more  జగ్గారెడ్డికి చెక్: సంగారెడ్డిపై మంత్రి హరీష్ నజర్

ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆహ్వానం మేరకు ప్రపంచంలో అనేక మంది తెలుగు కవులు, నిష్ణాతులు హాజరయ్యారని. వారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ కొనియాడదగిందన్నారు. వారిని చాలా గౌరవించాల్సిన అవసరం తెలుగు ప్రజలకు ఉందనటంలో మాకు ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం జరుగుతున్న వేదికపై టీడీపీ నేతలు పచ్చ కండువాలు తీసి తెల్ల కండువాలు వేసుకొని కనిపించారన్నారు. 

వారిలో కొందరు మాట్లాడిన మాటలు చూస్తే వారికి మాత్రమే తెలుగు మీద ప్రేమ ఉన్నట్లు మిగతా వారికి ప్రేమలేనట్లు ముఖ్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుగు అంటే గౌరవం లేనట్లు మాట్లాడారన్నారు. దానికి ప్రధాన కారణం వచ్చే సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమేనని తెలిపారు.

ఈ నిర్ణయం తెలుగు భాషను బహిష్కరించినట్లు, తెలుగు భాషను రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదన్నట్లు, తెలుగు భాష ఎవ్వరూ చదువుకోవటానికి వీల్లేదన్నట్లు కొంతమంది చిత్రీకరిస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని.. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ విపణిలో ప్రపంచస్థాయిలో నిలబడాలనే సదుద్దేశంతో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.

read more తెలుగు కంటే ఇంగ్లీషే ఈజీ... ప్రభుత్వానికి మేమిచ్చే నివేదిక ఇదే: జస్టిస్ ఈశ్వరయ్య

ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంటే తెలుగు భాషకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎందుకు భావిస్తున్నారో అర్థం కాలేదని అంబటి రాంబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విమర్శలు చేసేవారు, వారి పిల్లలు, వారి మనవళ్లు ఇంగ్లీషు మీడియం భాషలో చదువుకుంటున్నారని... అది మంచిదే కానీ ప్రతి ఒక్కరి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటుంటే ఎందుకు కాదంటున్నారని ప్రశ్నించారు.

66 ఏళ్ల క్రితం రాష్ట్రం ఏర్పాటు అయితే ఇప్పటికీ పేదవాడు, బడుగు బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువులు చదువుకోలేక వెనుకబడిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. పేదవాడు కూడా ఇంగ్లీషు మీడియం చదువుకోవాలి.... ఉన్నత చదువుల్లోకి వెళ్లాలి.... ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తుల్లోకి వారు వెళ్లేవిధంగా కాంపిటీషన్లో నెగ్గుకు రావాలనే సదుద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అంబటి తెలిపారు. 

click me!