
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 (సోమవారం) అంటే రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ శాసనసభాపక్షానికి కీలక దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో ఇవాళ (సెప్టెంబర్ 6, ఆదివారం) నిర్వహించిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులంతా తప్పనిసరిగా హాజరై ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించాలని కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షంలో ఉన్న తమకు సంఖ్యాబలమే కీలకమని... ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తమకు కేటాయించిన అంశాలపై పూర్తి సమాచారంతో సభలో మాట్లాడాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆ పాలనలోని వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలు, రైతులు, సాగునీరు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్, భూ సమస్యలు వంటి అంశాలను సభలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యింది... ఈ పాలనపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. ఆయా అంశాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనపై చేస్తున్న విమర్శలపైనా కేసీఆర్ రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. తనను అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రావాలో, వద్దో మీరే చెప్పాలని బిఆర్ఎస్ నాయకులకు అడిగినట్లు తెలుస్తోంది. తనపై వ్యక్తిగత విమర్శలు చేసే వారితో చర్చించడానికి తాను అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన చావు కోరుతూ కూడా పలుమార్లు ప్రసంగాలు చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమావేశంలో పాల్గొన్న నేతలు వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పక్షపాత ధోరణి అవలంబిస్తే దానిని సభలోనే ఎండగట్టాలని కేసీఆర్ బీఆర్ఎస్ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తే ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. సభలో నిబంధనలకు లోబడి బలమైన వాదన వినిపించడంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా గణాంకాలు, ఆధారాలతో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
సాగునీటి ప్రాజెక్టులు కూడా ఈసారి బీఆర్ఎస్ ప్రధాన అస్త్రాలుగా మారనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో బలంగా ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని కూడా పార్టీ యోచిస్తోంది. ప్రజల్లోకి వెళ్లి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని వివరించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర సాగునీటి అవసరాలకు కీలకమైన కాళేశ్వరంపై రాజకీయంగా మరింత దూకుడుగా వ్యవహరించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు లక్ష మందితో పాదయాత్రగా వెళ్లాలని కేసీఆర్ పిలుపునిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, బీఆర్ఎస్ వాదనలను ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్లో కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు కూడా ఇదే అంశంపై స్పందిస్తూ... కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన కూడా వెల్లడించారు. అసెంబ్లీలో రేవంత్ వాడే ఆ బజారు భాష వినడానికి కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆనాడు ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు లాంటి నేతలను సభలో అవమానిస్తే అసెంబ్లీని బహిష్కరించి, ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రులుగా అడుగుపెట్టారు... కేసీఆర్ ది కూడా అదే బాట అని హరీష్ రావు పేర్కొన్నారు. అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాడన్నమాట.
ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా? లేదా? అనే అంశం కూడా రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే సభలో ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కొంటారని చెబుతోంది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రభుత్వం తన వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమవుతుండగా.. బీఆర్ఎస్ మాత్రం ఎన్నికల హామీలు, వాటి అమలు, రైతులు, సాగునీరు, భూ సమస్యలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని పెంచే అవకాశముంది.