అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది.?
చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టన్నెల్ పనులను ఇటీవల తిరిగి ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 22 తేదీన ఉదయం 8.20 గంటలకు నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో టన్నెల్ పైభాగం కుప్పకూలింది. బోరింగ్ మిషన్ ప్రారంభించిన వెంటనే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో టన్నెల్ లోపల మొత్తం 40 మంది కార్మికులు, సిబ్బంది ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే హుటాహుటిన చాలా మంది వెనుదిరిగారు. అయితే 8 మంది మాత్రం సొరంగం లోపల చిక్కుకుపోయారు.
దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. సింగరేణి రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే టన్నెల్లో నీరు, బురద చేరడం వల్ల ఆపరేషన్కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు.
ఇప్పటికే దొరకని ఆచూకీ..
అయితే ప్రమాదం జరిగి రెండు రోజులు కావాల్సి వస్తున్నా ఇప్పటికీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచుకీ తెలియకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లోకోట్రైన్ రాకపోకలకు టన్నెల్లో 9వ కిలోమీటర్ దగ్గర అంతరాయం కలిగింది. ఈ సమస్య పరిష్కారానికి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. 11వ కిలోమీటర్ నుంచి ఏకంగా 2 కి.మీల మేర భారీగా నీరు, బురద చేరడంతో రెస్క్యూ ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా మారింది. టన్నెల్లో నిలిచిన నీటిని ప్రత్యేక పంపులతో బయటకు పంపిస్తున్నారు. మరో రెండు రోజులు గడిస్తే కానీ లోపల ఉన్న వారి ఆచూకీ తెలిసే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.