వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?

Published : Aug 23, 2026, 04:13 PM IST

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కుటుంబానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీలో రాజకీయ వేడిని పెంచాయి.

PREV
14
అస‌లు పంచాయతీ ఎక్క‌డ మొద‌లైందంటే.?

వరంగల్‌ జిల్లా గీసుకొండలో తన తల్లి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కొండా సుష్మిత పటేల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తే పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటానని, టికెట్‌ నిరాకరించినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి ఎవ‌రు అని సుష్మిత చేసిన వ్యాఖ్య‌లు పెద్ద ర‌చ్చ‌కు తెర తీశాయి.

పరకాల నియోజకవర్గం తమ కుటుంబానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యమున్న ప్రాంతమని సుష్మిత పేర్కొన్నారు. ఇటీవల పరకాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి విషయంలో అధిష్ఠానం అవకాశం ఇస్తుందనే విధంగా మాట్లాడుతూనే.. పరకాలలో మాత్రం ముందుగానే ఒక అభ్యర్థికి మద్ధతు ప్రకటించడం ఎందుకని ప్రశ్నించారు.

తమ కుటుంబం కాంగ్రెస్‌ కోసం చేసిన సేవలను కూడా సుష్మిత ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయాలనే ప్రతిపాదనలో తమ తల్లిదండ్రుల పాత్ర ఉందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడైన తర్వాత రేవంత్‌రెడ్డి తమ ఇంటికి వచ్చి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేరలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చినప్పటికీ కొండా మురళి ప్రచారం వల్లే ఆయన విజయం సాధించారని సుష్మిత వ్యాఖ్యానించారు.

24
సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు

సుష్మిత తన ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డిని నేరుగా లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సలహాదారుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించిన ఓ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారంటూ ఆరోపణలు చేశారు.

తాను ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోనని ఆమె అన్నారు. తన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తే సీఎం కుటుంబానికి సంబంధించిన అవినీతి అంశాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని హెచ్చరించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలకు లభిస్తున్న ప్రాధాన్యంతో పోలిస్తే పార్టీ కోసం పనిచేసిన అసలు కాంగ్రెస్‌ నేతలకు తగిన గుర్తింపు దక్కడం లేదని విమర్శించారు.

రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్‌ చేశారు. ఆయన తరఫున సీఎం ప్రచారం చేయాలని, తాను ప్రత్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని అన్నారు. బీసీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా ఆరోపించారు. యువతకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని ఒకవైపు చెబుతూ.. మరోవైపు సీనియర్‌ నేతకు మద్ధతు ఇవ్వడం భిన్న వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

34
సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌.. సురేఖ వివరణ

సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతల నుంచి వెంటనే స్పందనలు వచ్చాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు.. సుష్మితకు కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వమే లేదని, ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే స్థాయి ఆమెకు లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. సుష్మిత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని, అవసరమైన సమయంలో స్పందిస్తానని చెప్పారు.

ఈ వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా దృష్టి పెట్టింది. కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి.. ముఖ్యమంత్రిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఒక మంత్రిగా కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. సురేఖ ఇచ్చిన వివరణపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇతర కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలపైనా కమిటీ పరిశీలన కొనసాగుతోందని వెల్లడించారు.

మరోవైపు తనను, తన కుటుంబాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు. విచారణ కొనసాగుతున్న సమయంలోనే కొందరు పార్టీ నేతలు తనపై బహిరంగంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ స్పష్టం చేశారు. రాజకీయంగా ఒకే కుటుంబంలో ఉన్నవారికి కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చని చెప్పారు. సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ పట్ల తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు.

44
సుమంత్‌ కేసులో డ్రైవర్‌ అరెస్ట్‌.. దర్యాప్తు వేగం పెరిగే అవకాశం

ఇదే సమయంలో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన మరో కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసి, ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో సుమంత్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారి గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు సమాచారం.

మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో తొలుత జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం కేసును జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో సుమంత్‌తో పాటు మరికొందరి పేర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా తెల్లాపూర్‌లోని సుమంత్‌ నివాసం వద్ద ఆయన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సుమంత్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ అరెస్టుతో కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఒకవైపు సుష్మిత వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ విభేదాలు చర్చకు వస్తుండగా.. మరోవైపు సురేఖ మాజీ ఓఎస్డీకి సంబంధించిన కేసులో అరెస్టులు చోటుచేసుకోవడం కొండా కుటుంబానికి సంబంధించిన రాజకీయ పరిణామాలను మరింత కీలకంగా మార్చింది. పరకాల రాజకీయ భవిష్యత్తుపై సుష్మిత చేసిన ప్రకటన, కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పందన, సురేఖకు సంబంధించిన క్రమశిక్షణ చర్యలపై నిర్ణయం, సుమంత్‌ కేసులో దర్యాప్తు తదుపరి దశలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories