జులై 13న మీ పిల్ల‌ల‌కు ఈ ట్యాబ్లెట్స్ క‌చ్చితంగా వేయించండి.. ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇస్తోంది

Published : Jul 12, 2026, 05:43 PM IST

Telangana: పిల్లల్లో నులిపురుగుల సమస్యను తగ్గించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనుంది. జులై 13న 1 నుంచి 19 ఏళ్ల వారికి ఈ మాత్ర‌ల‌ను ఉచితంగా అందించ‌నున్నారు.

PREV
15
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 97 లక్షల మంది పిల్లలే లక్ష్యం

ఈ ఏడాది నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో మొత్తం 96,81,855 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర విద్యాసంస్థల్లో ఒకే రోజు ఈ పంపిణీ చేపడతారు. ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలోనే ప్రతి అర్హుడైన విద్యార్థికి మాత్ర వేయించనున్నారు. జులై 13న ఏదైనా కారణంతో మాత్ర తీసుకోలేని పిల్లల కోసం జులై 20న మాప్-అప్ డే నిర్వహించి వారికి కూడా అందించనున్నారు.

25
వయస్సును బట్టి మాత్రలు ఇలా ఇవ్వనున్నారు

పిల్లల వయస్సును అనుసరించి అల్బెండజోల్ మాత్రలు ఇచ్చే విధానాన్ని అధికారులు తెలిపారు.

* 1 నుంచి 2 సంవత్సరాలు – అర మాత్రను బాగా పొడి చేసి నీటితో కలిపి ఇవ్వాలి.

* 2 నుంచి 3 సంవత్సరాలు – ఒక పూర్తి మాత్రను పొడి చేసి నీటితో ఇవ్వాలి.

* 3 నుంచి 19 సంవత్సరాలు – ఒక పూర్తి మాత్రను నమిలి మింగాలి. అనంతరం కొద్దిగా నీరు తాగాలి.

చిన్న పిల్లలకు మాత్ర గొంతులో ఇరుక్కుపోకుండా జాగ్రత్తగా పొడి చేసి మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ సూచించింది.

35
ఇంటికి తీసుకెళ్లేందుకు కాదు.. అక్కడే వేయించాలి

ఈ అల్బెండజోల్ మాత్రలు పూర్తిగా సురక్షితమైనవేనని వైద్యాధికారులు తెలిపారు. అయితే మందులను ఇంటికి తీసుకెళ్లేందుకు ఇవ్వరు. అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల లేదా ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమక్షంలోనే పిల్లలకు మాత్ర వేయిస్తారు. దీనివల్ల ప్రతి అర్హుడికి మందు అందిందో లేదో నిర్ధారించుకోవడం సులభమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

45
నులిపురుగుల నివారణతో పిల్లలకు కలిగే ప్రయోజనాలు

నులిపురుగుల సమస్య చిన్నారుల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సమయానికి నివారణ మందు తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా రక్తహీనత వచ్చే ప్రమాదం తగ్గుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు సరిగా అందుతాయి. ఆకలి మెరుగుపడి ఎదుగుదల వేగవంతమవుతుంది. కడుపు నొప్పి, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. చదువుపై ఏకాగ్రత పెరిగి పాఠశాల హాజరు మెరుగవుతుంది. మట్టి ద్వారా వ్యాపించే నులిపురుగుల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

55
తల్లిదండ్రులకు ఆరోగ్య శాఖ సూచనలు

ఆరోగ్య శాఖ అధికారులు తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పిల్లలకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్ర వేయించాలని విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రత పాటించడం కూడా నులిపురుగుల నివారణలో కీలకమని సూచించారు. పిల్లలు భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, గోర్లు చిన్నగా ఉంచడం, మరిగించిన లేదా శుభ్రమైన నీరు తాగడం, పండ్లు, కూరగాయలను బాగా కడిగి వినియోగించడం, ఆహారాన్ని మూతపెట్టి ఉంచడం, బయట తిరిగేటప్పుడు చెప్పులు ధరించడం, బహిరంగ మలవిసర్జనకు బదులుగా మరుగుదొడ్లు ఉపయోగించడం వంటి అలవాట్లు నులిపురుగుల వ్యాప్తిని అరికట్టడంలో ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories