School Bandh: తెలంగాణలో విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు సమస్యలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చింది.
ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు
వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బంద్కి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో దానికి అవసరమైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
25
ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ లేదన్న విమర్శ
రాష్ట్రంలోని అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాటిపై కఠిన చర్యలు కనిపించడం లేదని ఏబీవీపీ ఆరోపించింది. ఫీజుల పెంపు కారణంగా మధ్యతరగతి, పేద కుటుంబాలపై భారీ ఆర్థిక భారం పడుతోందని పేర్కొంది. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
35
ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై ఆందోళన
రేషనలైజేషన్ పేరుతో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏబీవీపీ అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే విద్యకు ప్రధాన ఆధారం అని, అలాంటి పరిస్థితుల్లో పాఠశాలల సంఖ్య తగ్గించే చర్యలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని పేర్కొంది. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, విద్యాశాఖ పరిపాలనా పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ పూర్తికాలేదని ఏబీవీపీ విమర్శించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, గురుకులాల్లో శాశ్వత భవనాల సమస్య, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత వంటి అంశాలపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని, విద్యాహక్కు చట్టం (RTE) నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేసింది.
55
జూన్ 23 బంద్కు సహకరించాలని పిలుపు
విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కోరింది. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జూన్ 23న నిర్వహించనున్న పాఠశాలల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు మద్ధతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలపై ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ స్పష్టం చేసింది. దీంతో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు జూన్ 23న సెలవు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.