ఈ మీట్ ను భారత సమాఖ్యవాదానికి చారిత్రాత్మక దినంగా పేర్కొన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. న్యాయమైన ప్రాతినిధ్యం కోసం జాతీయ ఉద్యమంగా పరిణామం చెందిందని నొక్కి చెప్పారు. ఎక్స్ లో చేసిన పోస్టులో తమిళనాడులో మార్చి 5న జరిగిన సర్వపక్ష సమావేశాన్ని హైలైట్ చేశారు. అక్కడ 58 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఈ విషయంలో కలిసి వచ్చాయి. “ఇది ఒక సమావేశం మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ - ఇది మన దేశ భవిష్యత్తును రూపొందించే ఉద్యమ ప్రారంభం” అని స్టాలిన్ ప్రకటించారు.
ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ మీట్ కు ఎవరెవరు హాజరవుతున్నారు?
ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ మీట్ లో చాలా మంది కీలక ప్రతిపక్ష నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. వీరిలో కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఎంపీ కనిమొళి, మంత్రి కెఎన్ నెహ్రూ, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా సహా డీఎంకే ప్రతినిధి బృందం మార్చి 13న ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. వారు కలిసిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల విభజన ముసుగులో దక్షిణాదిపై కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలా జరిగితే దక్షిణాధి రాష్ట్రాలు తిరగబడతాయని హెచ్చరించారు.
ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ మీట్ ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది?
పార్లమెంటరీ సీట్ల పునర్విభజన పలు రాష్ట్రాలు నుంచి ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆందోళన పెరిగింది. జనాభా ఆధారిత పునర్విభజన కారణంగా పార్లమెంటరీ సీట్ల కేటాయింపు ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా మారుతుందనీ, దక్షిణాధి రాష్ట్రాల్లో మరింతగా సీట్లు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమావేశం ముఖ్యమైన ప్రతిపక్ష బల ప్రదర్శనగా చూడవచ్చు. నాయకులు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని అణగదొక్కే ప్రయత్నంగా భావించే అంశాన్ని తిప్పికొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇది పెద్ద రాజకీయ ఉద్యమానికి నాంది పలకవచ్చు.