Weather : దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నారు... దక్షిణాది రాష్ట్రాల్లో అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఇలా మండుటెండలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సతమతం అవుతున్నవేళ వాతావరణ శాఖ చల్లనికబురు చెప్పింది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండుమూడు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. దీంతో ఎండలతో విసిగిపోయిన ప్రజలు ఈ వీకెండ్ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు...హాయిగా కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.
తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు :
తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో చిరుజల్లులు మొదలయ్యాయి. నిన్న(గురువారం) నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. ఈ వర్షాలు ఈ మూడ్రోజులు (శుక్ర, శని, ఆదివారం) కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణపై వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు లేకున్నా వాతావరణ చల్లగా మారిపోతుందని తెలిపారు. మొత్తంగా ఈ వర్షాల కారణంగా ఇప్పుడు నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయని తెలిపారు.
మండుటెండలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్ళనుండి బయటకు వెళ్లేందుకు జంకుతున్న పిల్లలు, పేరేంట్స్ కు ఈ కూల్ వెదర్ కాస్త ఊరటనివ్వనుంది. ఈ ఆదివారం కూడా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి... కాబట్టి చల్లచల్లని వాతావరణంలో బయటకు వెళ్లి సరదాగా గడపవచ్చు. ఇలా వర్షాలతో వీకెండ్ హాయిగా గడిచిపోతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో మూడ్రోజులు వర్షాలు :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వరుసగా మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు మొదలవగా ఇవి మరింత విస్తరిస్తాయని... పలు జిల్లాల్లో మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మార్చి 21న అంటే ఇవాళ మొదలయ్యే వర్షాలు వీకెండ్ మొత్తం కొనసాగుతాయి. సోమవారం కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.... అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, భారీ హోర్డింగ్ లకు దూరంగా ఉండాలని... సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని ప్రకటించారు.
ఈ వర్షాలు కురిసే ప్రాంతాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ మేఘాలు కమ్మేసి ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. కానీ సముద్ర తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఎండలు మండిపోతున్న సమయంలో వర్షాల కురిసి వాతావరణాన్ని చల్లబర్చడం ఆనందించే విషయమే.