యాదగిరిగుట్టలో ప్రపంచ సుందరి సందడి :
మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ లో జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె ప్రముఖ దేవాలయం యాదగిరిగుట్టను సందర్శించారు. అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టులో యాదగిరిగుట్టకు వచ్చిన ఆమె లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
యాదాద్రి ఆలయానికి చేరుకున్న క్రిస్టినాను కలెక్టర్ హనుమంతరావు, దేవాలయ ఈవో భాస్కరరావు స్వాగతం పలికారు... ఆలయ మర్యాదలతో కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ ఆలయ సిబ్బంది దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు... గర్భగుడిలోని స్వయంభు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం క్రిస్టినాకు తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలను అందించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట విశిష్టతను ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు క్రిస్టినా. ఎక్కడ ఆలయ సాంప్రదాయాలకు భంగం కలిగించకుండా నడుచుకున్నారు. అందాల క్రిస్టినాను ఇలా అచ్చతెలుగు చీరకట్టులో చూసిన భక్తులు కళ్లు తిప్పుకోలేకపోయారు.