Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ ఇచ్చింది. సాయంత్రంలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేకపోతే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తామని డెడ్లైన్ విధించిందని సమాచారం. అసలు ఈ రచ్చకు కారణం ఏంటి?
కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్.. కొండా సురేఖ రాజీనామా చేయకపోతే బర్తరఫ్?
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఎవరూ ఊహించని రేంజ్లో సీన్ రివర్స్ అయింది. గురువారం సాయంత్రంలోపు మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం సురేఖకు స్పష్టమైన డెడ్లైన్ విధించినట్లు సమాచారం. ఒకవేళ ఆమె రాజీనామా చేసేందుకు ససేమీరా అంటే, ఏమాత్రం ఆలోచించకుండా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్కు లేఖ పంపుతామని హైకమాండ్ తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు పక్కా హైవోల్టేజ్ డ్రామా నడుస్తోంది.
25
అసలు రచ్చ ఎక్కడ స్టార్ట్ అయింది?
పరకాల నియోజకవర్గం సీటు విషయంలో కొండా సురేఖ కుమార్తె సుస్మితా చేసిన కామెంట్స్ ఈ పెద్ద దుమారానికి కారణమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సురేఖను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని పట్టుబట్టారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఈ అంశంపై సీరియస్ అయి రిపోర్టు తయారు చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ద్వారా ఈ రిపోర్టు ఏఐసీసీకి చేరింది.
35
ఢిల్లీలో రేవంత్ మార్క్ స్పీడ్.. క్లియర్ కట్ మెసేజ్
విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణే ముఖ్యం అని, సీఎంను, పార్టీ లైన్ను దాటి ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని రేవంత్ కరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలంటే సురేఖపై వేటు వేయడమే సరైన మార్గమని సీఎం తేల్చిచెప్పారు. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం పూర్తి సపోర్ట్ ఇచ్చారని సమాచారం.
ఢిల్లీలో ఇందిరా భవన్ లో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్లతో భేటీ అయిన తర్వాత సురేఖ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "తనను మంత్రి పదవి నుంచి ఎవరూ బర్తరఫ్ చేయలేరు.. కావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని అడగొచ్చు" అని ఘాటుగా స్పందించారు. పార్టీలో ఎవరు పడితే వాళ్లు మాట్లాడితే నోటీసులు ఇవ్వాలి అనుకుంటే, ముందుగా పదేళ్లు నేనే సీఎం అని చెప్తున్న రేవంత్ రెడ్డితోనే మొదలుపెట్టాలని కామెంట్స్ చేశారు. తన కూతురు స్వతంత్రురాలని, ఆమె వ్యాఖ్యలకు తానెలా బాధ్యత వహిస్తానని ప్రశ్నించారు. బీసీ మహిళా మంత్రిని కాబట్టే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
55
క్లైమాక్స్కు చేరిన కొండా ఎపిసోడ్: ప్లాన్ బి వర్కవుట్ అవుతుందా?
మరోవైపు కొండా సురేఖ దంపతులు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి వరంగల్కు వెళ్తున్నారు. అనుచరులతో భేటీ అయి తదుపరి చర్యలపై చర్చించనున్నారు. హైకమాండ్ సాయంత్రం డెడ్లైన్ విధించిన నేపథ్యంలో సురేఖ రాజీనామా లేఖ పంపుతారా లేక తిరుగుబాట పడతారా అనేది హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నాయి. మరి కొండా సురేఖ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారు? ఈ కొండా ఎపిసోడ్కు ఈరోజే ఎండ్ కార్డ్ పడుతుందా లేదా ఇంకేదైనా బిగ్ ట్విస్ట్ ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది.