చిన్నపుడు పహిల్వాన్ కావాలనుకున్నా... కానీ..: జనసేనాని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Feb 28, 2021, 2:03 PM IST

చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్న కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు... స్థానికంగా ఉండే పహిల్వాన్ అప్పారావు లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడినని హీరో పవన్ కల్యాణ్ తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. 

హైదరాబాద్: గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు మన దేశానికి చాలా అవసరమని, దేశీయ యుద్ధ విద్యలైన కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమన్నారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని హెచ్చరించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని సత్కరించారు.
undefined
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... ప్రాచీన యుద్ధ విద్యలకు మన దేశం పేరెన్నికగన్నదన్నారు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోక అంతరించిపోయే దుస్థితి నెలకొందని... అయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉందన్నారు.
undefined
''చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్న కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు. స్థానికంగా ఉండే పహిల్వాన్ అప్పారావు లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడిని. నేర్పుకోవాలనే తపన ఉండేది కానీ శరీరం సహకరించేది కాదు. కోడి రామ్మూర్తి నాయుడు గారిలా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీ తీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లోకి వెళ్లి కొంత సాధన అయితే చేశాను. కిక్ బాక్సింగ్, కరాటే, ఇండోనేషియా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందాను'' అని పవన్ వివరించారు.
undefined
''బలమైన మస్తిష్కంతో పాటు బలమైన శరీరం ఉండటం చాలా అవసరం. శారీరక దారుఢ్యం ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది. సగటు భారతీయుడు, ముఖ్యంగా తెలుగువారు గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలను ప్రోత్సహించాలి. జనసేన ప్రభుత్వం వస్తే ప్రాచీన యుద్ధ విద్యలను ప్రోత్సహిస్తాం'' అని హామీ ఇచ్చారు.
undefined
''జనసేన నాయకులు, జనసైనికులను యుద్ధ విద్యలను ప్రోత్సహించమని కోరుతున్నాను. మీ పిల్లలను కూడా యుద్ధ విద్యలను అభ్యసించడానికి పంపించండి. సమాజం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యాలు ఏలుతారు. మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుంటే అవినీతిపై పోరాటం చేయడానికి శక్తి వస్తుంది. ఒక పద్దతి, క్రమశిక్షణ అలవడుతుంది'' అన్నారు.
undefined
''నా సినిమా కోసం (దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న చిత్రం) ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన వీళ్లందరికి కృతజ్ఞతలు. మీరు అందించిన స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రతి గ్రామం నుంచి మల్లయోధులు రావాలి. భారతదేశంలో బలమైన సమాజం పునర్నిర్మాణానికి మన తెలుగు వారు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను'' అని పవన్ పిలుపునిచ్చారు.
undefined
ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరునా ఆత్మీయంగా పలకరించి శాలువా కప్పి, వెండి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు. తెలుగు మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గొప్పతనాన్ని వారికి వివరించారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లెలో పుట్టిన ఆయన ప్రపంచ ప్రఖ్యాత యోధుడుగా ఎలా ఎదిగారు, దేశవిదేశాల్లో సాహస కృత్యాలు చేసే స్థాయికి ఎలా చేరుకున్నారో వారికి తెలియజేశారు. చివరగా మల్లయోధుల బృందానికి గదను బహుమతిగా అందించారు.
undefined
click me!