
మనం వాడే మందులు, తినే ఆహార పదార్ధాలకు ఎక్స్పైరీ డేట్ ఉండటం కామన్గా చూస్తుంటాం. కానీ, మన ఇంట్లో రాత్రింబవళ్లు నడిచే స్మార్ట్ టీవీకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ లేదా లైఫ్ స్పాన్ ఉంటుందని మీకు తెలుసా? కొత్త టీవీ కొనేటప్పుడు మనం బ్రాండ్, ఫీచర్లు, డిస్కౌంట్ల గురించే ఆలోచిస్తాం కానీ, దాని లైఫ్స్పాన్ గురించి అస్సలు పట్టించుకోం. అయితే, ప్రతి టీవీకి, ముఖ్యంగా దాని డిస్ప్లే ప్యానెల్కు ఒక నిర్దిష్టమైన లైఫ్ ఉంటుంది.
ఈ విషయంపై 2016లోనే బహిరంగంగా పెద్ద చర్చ నడిచింది. అప్పట్లో ప్రముఖ డిస్ప్లే తయారీ సంస్థ 'ఎల్జీ డిస్ప్లే' వైస్ ప్రెసిడెంట్ లీ బ్యుంగ్-చుల్ కొరియా మీడియాకు ఒక కీలక సమాచారం ఇచ్చారు. తమ కంపెనీ ఓఎల్ఈడీ ప్యానెళ్ల లైఫ్ ను 1 లక్ష గంటలకు పెంచినట్లు ఆయన ప్రకటించారు. అంటే ఆ సమయం దాటిన తర్వాత ఎప్పుడైనా సరే కొత్త టీవీ కొనాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సాధారణంగా టీవీ కంపెనీలు ఈ ఎక్స్పైరీ డేట్ గురించి ఓపెన్గా మాట్లాడవు. దీని వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా టీవీ డిస్ప్లేలను తయారు చేయడంలో ఎల్జీ డిస్ప్లే అత్యంత పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలు చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వీటితో పాటు మినీ ఎల్ఈడీ డిస్ప్లేలు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. 2016 నాటి రిపోర్టుల ప్రకారం.. ఎల్జీ తన ఓఎల్ఈడీ ప్యానెల్ లైఫ్ను 1 లక్ష గంటలకు పెంచింది. ఆ సమయంలో నార్మల్ ఎల్ఈడీ టీవీల ఆయుష్షు దాదాపు 1 లక్ష గంటలుగా ఉన్నప్పటికీ, ఓఎల్ఈడీ టీవీలు ఆ విషయంలో కాస్త తక్కువగా ఉండేవి.
ఒక సాధారణ లెక్క ప్రకారం చూసుకుంటే.. ఒక ఇంట్లో రోజుకు సగటున 6 గంటల పాటు టీవీ చూస్తున్నారని అనుకుందాం. అలా అయితే థియరిటికల్గా ఆ టీవీ 18 నుండి 45 సంవత్సరాల వరకు పని చేయాలి. కానీ ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో సీన్ అంత ఈజీగా ఉండదు.
వోల్టేజ్ హెచ్చుతగ్గులు, టీవీలోని స్పేర్ పార్ట్స్ అరిగిపోవడం, దుమ్ము-ధూళి చేరడం, వాతావరణంలో తేమ వంటి రకరకాల కారణాల వల్ల చాలా టీవీలు సాధారణంగా 7 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే బాగా పనిచేస్తాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి.
టీవీల రివ్యూలు, టెస్టింగ్స్ చేయడానికి పాపులర్ అయిన 'RTINGS' అనే వెబ్సైట్ తమ ల్యాబ్లో ఒక భారీ ప్రయోగం చేసింది. వారు వేర్వేరు బ్రాండ్లకు చెందిన 100 కంటే ఎక్కువ టీవీలను సేకరించి టెస్ట్ చేశారు. ఎక్కువ కాలం వాడటం వల్ల ఈ టీవీలు ఎంత వేగంగా, ఎలా పాడైపోతాయో తెలుసుకోవడమే ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశం.
ఈ ప్రయోగంలో భాగంగా రోజుకు దాదాపు 20 గంటల పాటు టీవీలను కంటిన్యూస్గా ఆన్ చేసి ఉంచారు. అంతేకాదు, న్యూస్ టిక్కర్లు, ఛానల్ లోగోలు స్క్రీన్పై ఒకే చోట స్థిరంగా ఉండేలాంటి వీడియోలను మాత్రమే అందులో ప్లే చేశారు.
ఈ RTINGS టెస్టింగ్లో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఓఎల్ఈడీ టీవీలలో 'బర్న్-ఇన్' సమస్య నిజంగానే వస్తుందని తేలింది. అంటే, ఏదైనా ఛానల్ లోగో లేదా న్యూస్ టిక్కర్ స్క్రీన్పై లాంగ్ టైమ్ అలాగే ఉండిపోతే, టీవీ కట్టేసినా లేదా వేరే ఛానల్ మార్చినా ఆ లోగో తాలూకు పర్మనెంట్ మార్క్ స్క్రీన్పై అలాగే కనిపిస్తుంది. ఎవరైతే రోజూ ఒకే న్యూస్ ఛానల్ చూస్తారో లేదా గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుతుంటారో, వారి టీవీ స్క్రీన్పై ఇలాంటి పర్మనెంట్ మచ్చలు పడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు, ఎల్ఈడీ/ఎల్సీడీ టీవీలు ఎప్పటికీ ఇలా పాడైపోవని అనుకునే వారి నమ్మకం కూడా తప్పు అని ఈ పరీక్షలో రుజువైంది. ఎల్ఈడీ టీవీల లోపల ఉండే బ్యాక్లైట్, అంటే చిన్న చిన్న ఎల్ఈడీ బల్బులు కాలక్రమేణా పాడైపోతాయి. దీనివల్ల స్క్రీన్పై అక్కడక్కడా నల్లటి లేదా విపరీతమైన వెలుతురుతో కూడిన బ్రైట్ మచ్చలు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ వెబ్సైట్ రిపోర్ట్ ప్రకారం.. టీవీ ఎల్ఈడీ అయినా, ఓఎల్ఈడీ అయినా సరే, చాలా కాలం పాటు వాడేసరికి దాని మాగ్జిమం బ్రైట్నెస్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది.
మీ ఇంట్లోని స్మార్ట్ టీవీ ఎక్స్పైరీ స్టేజ్కు వచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి..
• బ్రైట్నెస్ తగ్గడం: టీవీ స్క్రీన్పై గతంలో లాగా బ్రైట్నెస్ లేదా వెలుతురు కనిపించకపోతే, లోపల ఉన్న బ్యాక్లైట్ వీక్ అయిపోతుందని అర్థం చేసుకోవాలి.
• రంగులు మారిపోవడం: స్క్రీన్పై కలర్స్ చేంజ్ అవ్వడం, ముఖ్యంగా ప్యూర్ వైట్ కలర్ కాస్త పసుపు రంగులోకి లేదా బ్లూ కలర్లోకి మారుతున్నట్లు అనిపిస్తే డిస్ప్లేలో ప్రాబ్లం స్టార్ట్ అయినట్లే.
• సాఫ్ట్వేర్ ఎక్స్పైరీ: ప్రస్తుతం వచ్చే స్మార్ట్ టీవీలకు కంపెనీలు కొన్ని సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వడం ఆపేస్తాయి. అలాంటప్పుడు టీవీ చాలా స్లో అయిపోతుంది లేదా మాటిమాటికీ హ్యాంగ్ అవుతుంటుంది. దీన్ని కూడా సాఫ్ట్వేర్ పరంగా టీవీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పవచ్చు.