T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో ఐర్లాండ్తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో జింబాబ్వే సూపర్ 8కు అర్హత సాధించింది. దీంతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుండి అవుట్ అయింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సికందర్ రజా సేన సంచలనం రేపింది.
వరల్డ్ కప్ నుండి ఆస్ట్రేలియా అవుట్.. సూపర్ 8కు జింబాబ్వే
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచలనం నమోదైంది. ప్రపంచ క్రికెట్లో జయింట్ కిల్లర్స్ గా పేరు తెచ్చుకున్న జింబాబ్వే జట్టు మరోసారి తన సత్తా చాటింది. పల్లెకెలెలో ఐర్లాండ్తో జరగాల్సిన గ్రూప్-బీ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. ఈ ఒక్క పాయింట్తో జింబాబ్వే మొత్తం 5 పాయింట్లు సాధించి సూపర్ 8 దశకు అధికారికంగా అర్హత సాధించింది. అదే సమయంలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి అవుట్ కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
26
పల్లెకెలెలో వర్షం.. ఆసీస్కు శాపం
మంగళవారం ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫలితంపై ఆస్ట్రేలియా భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ గెలిస్తేనే ఆస్ట్రేలియాకు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ, పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లింది. మైదానం చిత్తడిగా మారడం, వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో జింబాబ్వేకు సూపర్ 8 బెర్త్ ఖాయమైంది. ఆస్ట్రేలియా తన గ్రూప్ దశలో జింబాబ్వే, శ్రీలంక చేతుల్లో ఓడిపోవడంతో కేవలం 2 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
36
శతాబ్దపు గొప్ప ఘనత
జింబాబ్వే క్రికెట్ చరిత్రలో ఈ శతాబ్దంలో ఇదే అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. 1999 వన్డే ప్రపంచకప్లో సూపర్ సిక్స్కు చేరిన తర్వాత, ఐసీసీ టోర్నీలో ఆ జట్టు సాధించిన గొప్ప మైలురాయి ఇదే. గత కొన్నేళ్లుగా ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, పేదరికం వంటి అడ్డంకులను అధిగమించి ఆటగాళ్లు ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. రెండు తరాల ఆటగాళ్ల కృషికి ఇది దక్కిన ప్రతిఫలమని క్రీడాభిమానులు కొనియాడుతున్నారు.
సూపర్ 8కు చేరిన ఏడో జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఈ జట్టు ఇప్పుడు గ్రూప్ G1లో భాగమైంది. ఈ గ్రూప్లో ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. జింబాబ్వే తన సూపర్ 8 ప్రయాణాన్ని టీమ్ ఇండియాతో ప్రారంభించనుంది. ఫిబ్రవరి 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం లో భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్లో ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో భారత్ తలపడుతుంది.
56
ఇది ఆరంభం మాత్రమే.. సికందర్ రజా
తమ జట్టు సాధించిన విజయంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా హర్షం వ్యక్తం చేశారు. "మేము సాధించిన ఈ ఘనత కేవలం ఒక ఆరంభం మాత్రమే. మా లక్ష్యం ఇంకా పెద్దదిగా ఉంది. దీనిని మేం చిన్న వేడుకగా జరుపుకుంటాం, కానీ వెంటనే తదుపరి మ్యాచ్లపై దృష్టి పెడతాం. అండర్ డాగ్స్ కథలను అందరూ ఇష్టపడతారు, మేం ప్రపంచ క్రికెట్లో మా గౌరవాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం" అని రజా పేర్కొన్నారు. అలాగే తమకు సపోర్టుగా నిలుస్తున్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
66
మారిన గ్రూప్ సమీకరణాలు
గ్రూప్ బీ నుండి శ్రీలంక ఇప్పటికే 6 పాయింట్లతో సూపర్ 8కు చేరింది. జింబాబ్వే తన చివరి లీగ్ మ్యాచ్ను ఫిబ్రవరి 19న సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకతో ఆడనుంది. మరోవైపు సూపర్ 8 గ్రూప్ G2లో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉండగా.. పాకిస్థాన్ లేదా అమెరికాలో ఒక జట్టు చేరనుంది. గ్రూప్ G1 మ్యాచ్లన్నీ భారత్లో జరగనుండగా, గ్రూప్ G2 మ్యాచ్లు శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలెలో నిర్వహించనున్నారు.